తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారన్న ఆగ్రహంతో నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్స్టేషన్లో హల్చల్ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ‘నా ప్రొటోకాల్ మీకు తెలుసా’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. సర్వే చేస్తున్నారన్న అనుమానంతో బెంగళూరుకు చెందిన కొందరు యువకులపై స్థానిక వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఐదో పట్టణ పోలీస్స్టేషన్లో వైకాపా కార్యకర్తలపై కేసునమోదైంది.
పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎమ్మెల్యే పోలీస్స్టేషన్కు వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయన మద్యం సేవించి ఉన్నారని పలువురి ఆరోపణ. గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సర్వే అని ఎవరు వచ్చిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వారు తమ మద్దతుదారుల ఓట్లు తీసేస్తున్నారు అంటూ వారిపై దాడులకు తెగ బడుతున్నారు. అయితే విచారణ అనంతరం అటువంటిది ఏమీ జరగడం లేదని ప్రతీ కేసులోనూ తేలడంతో వైకాపా కార్యకర్తలు కేసులలో ఇరుక్కుంటున్నారు.
ఇప్పటికే ఎన్నికల కమిషన్ తమకు తెలియకుండా ఎవరూ ఓట్లు తీయడం అనేది అసంభవమని తేల్చి చెప్పినా నాయకులు పెంచి పోషించిన అనుమానాల వల్ల వైకాపా కార్యకర్తలు దాడులకు తెగబడి ఆ తరువాత కేసులలో ఇరుక్కుంటున్నారు. ఆ తరువాత శ్రీధర్ రెడ్డి లాంటి నాయకుల ఓవర్ యాక్షన్ షరా మాములే. చేసిందంతా చేసి ఆ తరువాత పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపణలు చెయ్యడం కూడా మాములే. ఎమ్మెల్యేపై కేసు నమోదు చెయ్యాలని డిమాండ్లు వస్తున్నాయి.



