ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు, పోలీస్ ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారిందని చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వారిపై అధికార పార్టీ ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. మరోవైపు వారు అధికార పార్టీకి తొత్తులుగా మారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ డీజీపీతో సహా 22 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేశారు.
ప్రతిపక్షాలు, ఈసీ ఏమనుకుంటే మాకెందుకు… మేము అధికార పార్టీతోనే అంటకాగుదామని పోలీసులు అనుకున్నా, వారి నుంచి కూడా భరోసా లభించకపోగా వైసీపి నేతలే పోలీస్ స్టేషన్పై దాడి చేసి విధ్వంసం కూడా సృష్టించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదీ… మాజీ మంత్రి, వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని సమక్షంలో జరగడం గమనిస్తే వైసీపి అరాచకాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్దమవుతుంది.
పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న బందరు నియోజకవర్గంలోని ఉల్లిపాలెంలో ఇటీవల నూకాలమ్మ తల్లి జాతర జరిగింది. ఆ జాతరలో టిడిపి, వైసీపి వర్గాల మద్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా అక్కడే డ్యూటీలో ఉన్న ఎస్సై చాణక్య ఇరువర్గాలను చెదరగొట్టి జాతర సజావుగా జరిగేలా చేశారు.
కానీ ఎస్సై చాణక్య తమతో చాలా దురుసుగా మాట్లాడారంటూ మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పేర్ని నాని, ఆయన అనుచురులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైసీపి కార్పొరేటర్లు జవ్వాది రాంబాబు, మీర్ అస్గర్ అలీ, మేకల సుబ్బన్న ముగ్గురూ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పేర్ని నానితో సహా వారందరిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.
అధికార పార్టీ పోలీసులను వాడుకోవడం కొత్తేమీ కాదు. కానీ వారిని వాడుకుంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్పై దాడి చేయడమే విస్మయం కలిగిస్తుంది. అదీ… రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో ఈవిదంగా జరగడం విస్మయం కలిగిస్తుంది.
దీనిని వైసీపి ఏ విదంగా సమర్ధించుకుంటుందో ఊహించుకోవచ్చు కానీ ఇప్పుడైనా ఎన్నికల సంఘం పట్టించుకుంటుందో లేదో చూడాలి.




