వైసీపిలో అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ వంటి కొందరికి నోటి పవర్ చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి నోటికి రోజూ బలవుతూనే ఉంటారు. అయినా వారందరూ తట్టుకొని నిలబడ్డారు.
వైసీపిలో ఈ నలుగురితో పోలిస్తే వల్లభనేని వంశీ కాస్త సాఫ్ట్ అనే చెప్పాలి. కానీ ఆయన కూడా అప్పుడప్పుడు నోటి దురద పెరిగినప్పుడు మాట తూలుతుంటారు.
ఇదివరకు ఓసారి సాక్షి మీడియాతో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. “నారా లోకేష్ ఓ చవట. వాడిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలనుకుంటే మంగళగిరిలో ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాడు ఆ దద్దమ్మ,” అని వల్లభనేని వంశీ అన్నారు.
అదే వల్లభనేని వంశీ… ఇటీవల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 అధ్వర్యంలో ‘5 ఎడిటర్స్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఒక తరానికి నచ్చింది మరో తరానికి నచ్చక పోవచ్చు. మాకు చంద్రబాబు నాయుడుగారితో పెద్దగా సైద్ధాంతిక విభేధాలు కానీ మనస్పర్ధలు గానీ లేవు.
జిల్లా నాయకులు, నారా లోకేష్ బాబుగారితో నేను కొడాలి నాని ఇమడలేక వేరే పార్టీలోకి మారాల్సివచ్చింది. ఆ తర్వాత వెనక్కు తిరిగి రాలేకపోయాము. అంతే!” అని వల్లభనేని వంశీ జవాబు చెప్పారు.
ఈ రెంటినీ చూస్తే వల్లభనేని వంశీ స్వరంలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. అంటే ఈసారి గన్నవరంలో ఓటమి తప్పదని ముందే గ్రహించారా?అందుకే చంద్రబాబు నాయుడు ముసలోడుకి బదులు ‘చంద్రబాబు నాయుడు గారు’ అని, నారా లోకేష్ చవట, దద్దమ్మ అనే బదులు ‘నారా లోకేష్ గారు’ అని అంటున్నారనుకోవచ్చు.
కానీ ఇప్పుడు గొంతు మార్చి పార్టీ మారాలనుకున్నా సాధ్యం కాదు. జరుగకూడని నష్టం చాలా జరిగిపోయింది. టిడిపి హిట్ లిస్టులో వల్లభనేని వంశీ పేరు ఎప్పుడో చేరింది. కనుక ఇప్పుడు కొడాలి నానిలాగ గుడ్డిగా పోరాడక తప్పదు. ఓడిపోతే పర్యవసనాలను ఎదుర్కోవడానికి సిద్దం కాక తప్పదు.






