మాయ మాటలు, జిమ్మిక్ లెక్కలతో రెండేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ప్రధాన సహాయం చేయకుండానే కాలం గడిపేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ‘స్పెషల్ స్టేటస్’పై చేసిన స్పష్టమైన ప్రకటన ఏపీ ఎంపీలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో రాజకీయ వేడి మొదలైనట్లే కనపడుతోంది.
“రాష్ట్ర విభజన సందర్భంగా, గడిచిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్లమెంటు లోపలా, వెలుపలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు, అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్లలో విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం పూర్తి చేసిందో చెప్పాలి. లోటు బడ్జెట్ తో అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు నిధులు అంతంత మాత్రంగానే ఇచ్చిందని” ఏపీపై కేంద్ర ప్రభుత్వం చూపిన వైనాన్ని ఏకరువు పెట్టారు గల్లా.
“మాటలు చెప్పే సమయం ముగిసిపోయింది, ఇంకా మాటలు చెబితే ప్రజలు ఊరుకోరని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, తక్షణం ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మాటలు వినే ఓపిక ప్రజలకు లేదు, చేతలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఎలా కేటాయిస్తారు? ఎంత కేటాయిస్తారు? ఇచ్చిన హామీలు ఎలా నేరవేరుస్తారు? ఎంత సమమం లోపు నెరవేరుస్తారు? అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసారు గుంటూరు ఎంపీ. సాధారణంగా చాలా సైలెంట్ గా ఉండే గల్లా దూకుడు దేనికి సంకేతాలు…? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.



