జనసేనాని పవన్ కళ్యాణ్కు వడదెబ్బ తగలడంతో తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురవడంతో వారాహి యాత్రను వాయిదా వేసుకొని హైదరాబాద్ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యే ముందు ప్రతీరోజూ అభిమానులతో ఫోటోలు దిగేవారు. ఆ సమయంలో కొన్ని కిరాయి మూకలు అభిమానులలో కలిసిపోయి ఆయన సెక్యూరిటీ సిబ్బందికి, ఆయనకు బ్లేడ్లతో చిన్నగా గాయపరిచాయి. ఈ విషయం పవన్ కళ్యాణ్ స్వయంగా బయటపెట్టి పార్టీ అభ్యర్ధులతో సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పిఠాపురంలో పర్యటిస్తున్నప్పుడు స్థానిక చర్చిలో ప్రార్ధనలలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు కూడా కొందరు కిరాయి రౌడీలు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన్నట్లు నటిస్తూ వేళ్ళకున్న బంగారు ఉంగరాలను గుంజుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన గుర్తించడంతో వారు జనంలో కలిసి మాయమైపోయారు.
ఈ రెండు ఘటనలను బట్టి పవన్ కళ్యాణ్ని ఏదో విదంగా భయపెట్టి ఎన్నికల ప్రచారంలో తిరగకుండా అడ్డుకోవాలని ఎవరో కుట్రలు చేస్తున్నారని అర్దమవుతోంది. ఇదే విషయం పవన్ కళ్యాణ్ బయటేపెడితే, “ఇటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నానని” ముద్రగడ ద్మనాభం చెపుతారనుకుంటే, భిన్నంగా స్పందించడం విస్మయం కలిగిస్తుంది.
ఆయన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ఈ ఎండలలో తిరగలేక అప్పుడే చేతులెత్తేశారు. తనపై బ్లేడ్ బ్యాచ్ దాడులు చేస్తోందంటూ చెప్పి కార్యకర్తలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులను, కార్యకర్తలను దూరం పెట్టేందుకే పవన్ కళ్యాణ్ ఈ కొత్త నాటకం మొదలుపెట్టిన్నట్లున్నారు. చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్నా ఇంకా భయపడుతుంటే రాజకీయాలలో తిరగడం దేనికి?
పవన్ కళ్యాణ్కు ఏమి చెప్పుకోవాలో తెలియక, మళ్ళీ ఓడిపోతాననే భయంతోనే తనపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఆయన ఎన్ని వేషాలు వేసినా మళ్ళీ ఓడిపోవడం ఖాయం,” అని ముద్రగడ పద్మనాభం అన్నారు.
2014 ఎన్నికల సమయంలో విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి జరిగినప్పుడు, భుజానికి చిన్న గాయం అయ్యింది. కానీ అప్పుడు జగన్, వైసీపి నేతలందరూ చేసిన హడావుడి అందరూ చూశారు. ఆ కేసులో 5 ఏళ్ళపాటు న్యాయపోరాటం చేశారు. నిందితుడు శ్రీనివాస్ని 5 ఏళ్ళపాటు జైలు నుంచి బయటకు రాకుండా చేశారు.
కానీ పవన్ కళ్యాణ్ మీద భౌతికదాదులు జరుగుతున్నా ఆయన తొందరపడటం లేదు. జనసేన పార్టీ కూడా ఈ భౌతికదాడుల గురించి చెప్పుకొని హడావుడి చేయడం లేదు. కనుక ముద్రగడ పద్మనాభం ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ని కాదు… ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్న తన సొంత పార్టీనే!






