పాపం ముద్రగడ… పెద్దాయనతో ఈ ఆటలేమిటో!

Mudragada Padmanabham

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అని ఊరికే అనలేదు… ముద్రగడ పద్మనాభం విషయంలో జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా ఇంచు మించు ఇలాగే ఉందనిపిస్తోంది. ముందు తలుపులు బార్లా తెరిచి ఆహ్వానిస్తారు. లోనికి వస్తుంటే మొహం మీద తలుపులు వేసేసి అవమానిస్తుంటారు.

దీనినే ఇంకో విదంగా కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో చేరితే టికెట్, పదవులు ఇస్తామని ఆఫర్ ఇచ్చి టిడిపి, జనసేనల వైపు చూడకుండా కొన్ని రోజులు కట్టడి చేశారు. సరే ఎలాగూ వైసీపిలో చేరిపోతున్నాము కదాని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను విమర్శిస్తూ ఎడాపెడా నాలుగు లెటర్లు వ్రాసి పడేశారు.

ADVERTISEMENT

దాంతో ఆ రెండు పార్టీల తలుపులను ఆయన చేతనే జగన్‌ మూయించేశారు. ఆ దారి మూసుకుపోయాక ఆయనను వైసీపిలోకి చేర్చుకోకుండా జగన్‌ పక్కన పెట్టేశారు. దాంతో పెద్దాయనకి అన్ని దారులు మూసుకుపోయిన్నట్లయింది. అంటే ఆయన వేలితో ఆయన కళ్ళే పొడిపించారన్న మాట!

కానీ ఆయన అన్ని మాటలు అన్నప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ‘జనసేన తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయని’ గౌరవం ప్రకటించి తన గొప్ప మనసుని చాటుకున్నారు.

వైసీపి తలుపులు మూసుకుపోయినప్పుడు జనసేన తలుపులు తెరిచి ఉంచడంతో ఆ పార్టీలో చేరేందుకు ఆయన సిద్దపడ్డారు.

కానీ పవన్‌ కళ్యాణ్‌ తనని సంప్రదించకుండా చంద్రబాబు నాయుడుతో కలిసి 119 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేయడంతో ముద్రగడ పద్మనాభంకు మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ గుడ్ బై చెప్పేశారు.

దాంతో జగన్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మిథున్ రెడ్డిని పంపించి పెద్దాయనని పార్టీలో చేరవలసిందిగా కబురు పంపారు. ఇప్పుడు జనసేన తలుపులు మూసుకుపోయినప్పుడు వైసీపి తలుపులు మళ్ళీ తెరుచుకోవడంతో ముద్రగడ పద్మనాభం రేపు (గురువారం) తాడేపల్లి ప్యాలస్‌కు వెళ్ళి జగన్‌ సమక్షంలో కండువా వేసేసుకొనేందుకు సిద్దం అయ్యారు.

కానీ ఇప్పుడు ఆయన టిడిపి, జనసేనవైపు తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నందున జగన్‌ మళ్ళీ తలుపులు వేసేసినట్లున్నారు.

“జనాలను వెంటేసుకొని తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చేయొద్దు.. ‘సెక్యూరిటీ ప్రాబ్లమ్’ వస్తుందని” చెప్పారట! కనుక “ఈ నెల 15 లేదా 16 తేదీలలో నేను ఒక్కడినే లోనికి ప్రవేశించి కండువా కప్పుకొని వస్తాను. అందరూ అర్దం చేసుకోండి ప్లీజ్’ అంటూ పెద్దాయన మరో లెటర్ కొట్టారు.

ఆ స్థాయి నాయకుడు పార్టీలో చేరుతున్నారంటే తప్పనిసరిగా వేలాదిమంది అభిమానులు, ఆ వర్గానికి చెందిన ముఖ్య నేతలు ఆయన వెంట వెళ్ళి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటారు. కానీ లోనికి ఎవరికీ ప్రవేశం లేదని చెప్పేశారు.

కనీసం పెద్దాయనకైనా ఆరోజు తాడేపల్లి ప్యాలస్‌ తలుపులు తెరుస్తారో లేదో?పార్టీలో చేర్చుకుంటారో లేదో?చేర్చుకోకపోతే ఆయనే మరో లేఖ వ్రాసి చెపుతారు. చేర్చుకుంటే ఆ వార్త సాక్షి పేపర్లో చూసి తెలుసుకోవచ్చు. ఇంత వయసులో ఒక్క టికెట్‌ కోసం ఇన్ని అవమానాలు, విమర్శలు భరించడం అవసరమా?ఆలోచిస్తే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories