కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సుమారు నెలన్నర క్రితమే ‘ఇకపై వైసీపిని పట్టించుకోనని’ తెగేసి చెప్పారు. తనను కలిసేందుకు వస్తున్న వైసీపి నేతలను రావద్దని చెప్పేశారు. వైసీపి ధోరణితో తాను చాలా హర్ట్ ఆయ్యానని కనుక జనసేనలో చేరబోతున్నట్లు స్వయంగా చెప్పారు.
కానీ టిడిపి, జనసేనలు 118 మంది అభ్యర్ధులతో తొలి జాబితాలో తన పేరు కనపడకపోవడంతో అంత పెద్దాయన సంయమనం కోల్పోయి ‘జనసేనకు ఇక నా అవసరం పడకూడదనే ఆశిస్తాను,’ అంటూ పవన్ కళ్యాణ్కు ఘాటుగా లేఖ వ్రాసి, మళ్ళీ వైసీపికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
వైసీపి ఆ సిగ్నల్ వెంటనే క్యాచ్ చేసి ఆయనను పార్టీలో చేరుకొని ఆయనకు టికెట్, కొడుకుకి పదవి ఇచ్చేందుకు సిద్దమైంది. నేడు జగన్ తరపున రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి జిల్లా నేతలతో కలిసి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు.
ఆయనకు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు భావిస్తున్న పిఠాపురం టికెట్, ఆయన కుమారుడు ముద్రగడ గిరికి నామినేటడ్ పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ఇందుకు ప్రతిగా ఆయన ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో విస్తృతంగా వైసీపి తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ, కాపు ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపికి పడేలా చేయాల్సి ఉంటుందనే షరతు బయటకు చెప్పుకోకూడదు.
ముద్రగడ పద్మనాభం ఇంతకాలం కాపుల ప్రయోజనాల కోసం పోరాడిన నాయకుడుగా గౌరవం పొందుతుండేవారు. కానీ ఇప్పుడు టికెట్ లేదా పదవి స్వీకరిస్తే కాపు ఉద్యమాల ద్వారా ఆయన సంపాదించుకున్న ఆ గుర్తింపుని ఈవిదంగా తన స్వప్రయోజనానికి వినియోగించుకొంటున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో ఇది చాలా సహజమే కనుక ఆయనను ఇందుకు తప్పు పట్టలేము.
కానీ రాష్ట్రంలో కాపులు సమైక్య శక్తిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలని ఇంతకాలం వాదించిన ముద్రగడ ఇప్పుడు ఓ పదవి లేదా టికెట్ కోసం కాపులను రెండుగా చీల్చేందుకు వైసీపికి తోడ్పడబోతుండటం బాధాకరం.
రాష్ట్రంలో కాపులకు జనసేన ద్వారా రాజ్యాధికారం దక్కబోతున్న ఈ సమయంలో కాపు జాతి సంక్షేమం కోరే ముద్రగడ పద్మనాభం, జనసేనకు ఆ అవకాశం లేకుండా చేస్తే ఇదో చారిత్రిక తప్పిదమే అవుతుంది కదా?
కాపుల మేలు కలగాలని ఆయన అనుకుంటే, జనసేన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పంతాలు, పట్టింపులకి పోకుండా ఇటువంటి కీలక సమయంలో ఆ పార్టీకి అండగా నిలబడి, దానికి కాపుల మద్దతు కూడగట్టి గెలిపించుకునే ప్రయత్నం చేసి ఉంటే, ఆయన పేరు కాపు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది.
కానీ వైసీపి పాలనలో జరుగుతున్న ఆర్ధిక విధ్వంసం, అరాచకాలు, కాపులను చీల్చి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనే దాని ఎత్తులు జిత్తులూ అన్ని కళ్ళారా చూస్తూ కూడా ముద్రగడ తన గురించి, తన కుమారుడు గురించి మాత్రమే ఆలోచించుకొని వైసీపితో చేతులు కలిపితే, భవిష్యత్లో రాష్ట్రానికి, జనసేనకు, కాపులకు జరిగే నష్టాలకు ఆయనే కారకుడుగా చరిత్రలో మిగిలిపోతారు.
వైసీపితో దోస్తీ అంటే పులి మీద సవారీ అని ఎన్నికలలోగా లేదా తర్వాత అయినా తప్పకుండా గ్రహిస్తారు. వైసీపి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకొని నష్టపోయి అప్రదిష్ట పాలైనందుకు తాపీగా చింతించవలసి రావచ్చు కూడా. కనుక చేతులు కాల్చుకోక ముందే ముద్రగడ పద్మనాభం విజ్ఞతతో వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకుంటే అందరికీ చాలా మంచిది.




