చనిపోయి 32 ఏళ్ళు గడుస్తున్నా ప్రజల గుండెల్లో ఉన్న వంగవీటి మోహన రంగా వర్ధంతి పురస్కరించుకుని కృష్ణాజిల్లాలో రాజకీయంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసే సమయంలో వల్లభనేని వంశీతో కలిసి రాధా పాలు పంచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉండగా, మధ్యాహ్నం సమయానికి గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరులో రంగా విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన రాధాకు ఓ వైపు వల్లభనేని వంశీ, మరో వైపు కొడాలి నానిలు ఉండడం పెద్ద చర్చకు దారి తీసింది. ఒకప్పుడు ఈ ముగ్గురు మంచి స్నేహితులన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఇంతకు మించిన సంచలనం వంగవీటి రాధా నోటి నుండి వెలువడ్డాయి. తనను చంపడానికి కొంతమంది రెక్కీ నిర్వహించారని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు తన ఇద్దరు స్నేహితులు ఉండగా, రాధా చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత దక్కాయి.
ఎవరి పేర్లు ప్రస్తావించలేదు, అలాగే ఏ పార్టీకి సంబంధించిన వారని కూడా రాధా తెలపలేదు. సరిగ్గా తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం, అందులోనూ వైసీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న వల్లభనేని వంశీ మరియు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నడుమ చెప్పడం వెనుక “అంతరార్ధం” ఏమిటో!?



