
ఇళయరాజా… సంగీతంలో ఒక సముద్రం. వేల పాటలు, వందల సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను అలరించిన ఈ సంగీత దిగ్గజం అభిమానుల గుండెల్లో నిలిచారు. కానీ, మీడియాతో మాట్లాడటం ఆయన ఆసక్తి చూపించరు. ఏప్రిల్ 19, 2025న హైదరాబాద్లో ‘షష్టిపూర్తి’ అనే చిన్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇది స్పష్టమైంది. ఈ కార్యక్రమానికి ఇళయరాజా, ఎంఎం కీరవాణి వచ్చారు. కానీ, ఇళయరాజా మీడియా ప్రశ్నలు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన వివాదాల గురించి మాట్లాడటం ఇష్టం లేకనే, మీడియాను దూరం పెడుతున్నారా అనే ప్రశ్న ఎదురవుతుంది.
ఇళయరాజా సంగీతం గురించి ఆసక్తిగా మాట్లాడతారు, కానీ వివాదాల గురించి ప్రశ్నలు వస్తే మౌనంగా ఉంటారు. ఆయన జీవితంలో పలు వివాదాలు ఈ వైఖరికి కారణం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను అనుమతి లేకుండా పాడారని నోటీసు పంపగా, అభిమానులు ఆయనను తప్పుపట్టారు, 2024లో ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలో తన పాటను అనుమతి లేకుండా వాడిందని రూ. 2 కోట్లు కోరారు, ఇక ఈ మధ్యనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో మూడు పాటలు తన అనుమతి లేకుండా వాడారని రూ. 5 కోట్లు, క్షమాపణ కోరారు. ఈ వివాదాలపై మీడియా ప్రశ్నలు ఎదుర్కోవడం, సమాధానాలు చెప్పడం ఆయనకు భారంగా ఉండి ఉంటుంది, అందుకే మీడియా ఇంటరాక్షన్ అనగానే వెనక్కి తగ్గారు. అక్కడే ఉన్న M9 ప్రతినిధి కూడా ప్రశ్నలేవీ అడగకుండా, ఆయన నిర్ణయానికి గౌరవం ఇచ్చి ఈ మధ్య వినిపిస్తున్న ‘భారతరత్న’ ఇచ్చే విషయం గురించి మాట్లాడి ముగించారు.
Also Read – రాయలసీమ దశ తిరుగబోతోందా?
ఇళయరాజా తన పాటలను ఎవరైనా అనుమతి లేకుండా వాడితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ చర్యలు వివాదాలుగా మారినప్పుడు, సమాజంలో విమర్శలు ఎదుర్కొన్నప్పుడు మీడియా ప్రశ్నలు ఆయనకు ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ, సోషల్ మీడియా యుగంలో, మీడియాతో మాట్లాడకపోతే, వివాదాల గురించి తప్పుడు అవగాహనలు పెరిగే అవకాశం ఉంది. ఇళయరాజా సంగీతం ఎప్పటికీ అమరం, కానీ వివాదాల విషయంలో సరిగా స్పందించకుండా, మీడియాతో దూరంగా ఉండడం ఆయన ఇమేజ్ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆలోచించాల్సిన విషయం.