తాడేపల్లిలోని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలోకి మంగళవారం ఓ కంటెయినర్ వాహనం ప్రవేశించింది. దానిపై పోలీస్ అని వ్రాసి ఉంది. అయితే అది ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రధాన ద్వారం గుండా ప్రవేశించలేదు. వేరే మార్గంలో ప్రవేశించింది. అది లోనికి ప్రవేశిస్తున్నప్పుడు, కొంత సేపు తర్వాత బయటకు వెళ్లిపోతున్నప్పుడు కూడా భద్రతా సిబ్బంది దానిని తెరిచి లోపల ఏమున్నాయో పరిశీలించలేదు.
కనుక టిడిపి యువనేత నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ, “అయ్యా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులూ.. రోజు నా కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? మీ ఎదురుగా సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్ ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం డిజిపి చెబుతారా?” అని ట్వీట్ చేశారు.
నారా లోకేష్ వాహనం రోడ్డుపై కనిపిస్తే చాలు… పోలీసులు వెంటనే ఆపి తనికీ చేస్తుంటారు. కనుక నారా లోకేష్ ఈవిదంగా ప్రశ్నించడం సహేతుకమే.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో ఇద్దరు ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ ఉప ఎన్నికలు, శాసనసభ ఎన్నికల సమయంలో తమ పోలీస్ వాహనాలలో అధికార పార్టీ సొమ్ముని నియోజకవర్గాలకు తరలించడానికి సాయపడ్డారని వారి పై అధికారే ఫిర్యాదు చేశారు.
కనుక తెలంగాణలో జరిగిన ఇటువంటి చిత్రాలు ఏపీలో జరగవనుకోలేము.
తాడేపల్లి ప్యాలస్లోకి పోలీస్ వాహనమే ప్రవేశించింది. అది లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు భద్రతా సిబ్బంది తనికీలు చేయలేదు. కనుక బయట సరుకు లోపలకు వచ్చిందా లేదా లోపల సరుకు బయటకు వెళ్ళిందా?అని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. బహుశః సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్పవచ్చు. కనుక అంతవరకు సస్పెన్స్ భరించాల్సిందే.




