సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారు తమకు మీడియాలో మంచి ప్రచారం లభించాలని, తద్వారా తమకు మరింత పేరుప్రతిష్టలు లభించాలని, తమ పాపులారిటీ మరింత పెరగాలని కోరుకొంటారు. అందుకే మీడియా, సోషల్ మీడియాతో టచ్చులో ఉంటారు. కనుక వారి గురించి, వారి సినిమాలు, పార్టీలు లేదా రాజకీయాల గురించి అందరూ మాట్లాడుకొంటుంటారు. మీడియాలో వార్తలు, విశ్లేషణలు, చర్చలు నడుస్తుంటాయి.
కానీ జనసేన రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నాగబాబు ఇటీవల ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, “జనసేన పార్టీ టిడిపి, బిజెపిలలో దేనితో పొత్తులు పెట్టుకొంటుందనే విషయంపై సమాజంలో కొందరు మేధావులు, మీడియాలో (అనవసర) విశ్లేషణలు చేస్తున్నారు. మనం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటామో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. కనుక పొత్తుల గురించి ఆలోచించడం మానేసి మన పార్టీ ఎంతమంది అభ్యర్ధులను నిలబెడితే అందరినీ గెలిపించుకొనే బాధ్యత మన అందరిదీ. పవన్ కళ్యాణ్ తప్పకుండా మన అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకొంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలతో తీరిక లేకపోవడం వలననే నాగబాబుకి పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారని చెప్పుకొంటున్నారు. కానీ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పట్ల అసంతృప్తిగా ఉన్నందునే నాగబాబుకి పగ్గాలు అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో అప్రస్తుతం.
నాగబాబు నాదెండ్లలా బయట వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ సొంత తమ్ముడు. పైగా పార్టీలో ఇప్పుడు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు కూడా. కానీ పొత్తుల గురించి సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోగా ఎవరూ వాటి గురించి మాట్లాడకూడదనుకోవడం విచిత్రంగా ఉంది. తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న కేటీఆర్, జిల్లా, నియోజకవర్గాల పర్యటనలు చేస్తున్నప్పుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు.
ఒకవేళ ఆయన తన తండ్రి కేసీఆర్తో సంప్రదించి ప్రకటిస్తున్నారనుకొంటే, నాగబాబు కూడా పొత్తుల విషయంలో అదే చేయొచ్చు కదా?పవన్ కళ్యాణ్తో మాట్లాడి నాదెండ్ల వంటి సీనియర్లతో కలిసి బిజెపి, టిడిపిలతో చర్చించి పొత్తులు ఖరారు చేసుకోవచ్చు కదా?కానీ అన్నీ పవన్ కళ్యాణ్ చూసుకొనే మాటైతే ఇక నాగబాబు ఎందుకు ఆ పదవిలో?అనే సందేహం కలుగుతుంది.



