సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ‘కింగ్’ నాగార్జున చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం తన సినిమాల విషయాలే కాకుండా, కుటుంబ పరమైన అంశాలను షేర్ చేసుకుంటున్న నాగ్, పుకార్ల విషయంలో అయితే తన దృష్టికి వచ్చిన మరుక్షణం వాటిని ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా కింగ్ ఫాలోయర్ల సంఖ్య 3 మిలియన్ సంఖ్యకు చేరుకుంది. నాగ్ కంటే ముందు ప్రిన్స్ మహేష్ బాబు 3.6 మిలియన్ ఫాలోయర్స్ తో అగ్ర స్థానంలో ఉన్నాడు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా నాగ్ కున్న ఫాలోయర్స్ ను గమనిస్తే… 260వ ర్యాంకు దక్కింది. రోజూ 5 వేల మంది కొత్త ఫాలోయర్స్ తో చెలరేగిపోతున్న నాగ్ ట్విట్టర్ ఖాతా 30 లక్షలకు చేరుకున్న సందర్భంగా… ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగ్ కు ఓ ట్వీట్ వచ్చింది. ‘ట్విట్టర్ కౌంటర్’ అనే వెబ్ సైట్ ద్వారా ఈ వివరాలు తెలుపగా, `ఇంత అభిమానం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు` అంటూ సమాధానమిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో మొదటి ర్యాంకు పాప్ సింగర్ కేటీ పెర్రీది. ఈమెకు 10,23,16,810 మంది ఫాలోవర్లు ఉన్నారు. టాప్ 100లో నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొనె, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కొహ్లీ వంటి ఇండియన్ సెలబ్రిటీలు ఉన్నారు.


