సాధారణంగా పదో తరగతి పిల్లలు తెలిసీ తెలీని కౌమార్య దశలో ఉంటారు. కనుక స్నేహితులతో ఎంజాయ్ చేసేందుకు తండ్రి జేబులో చిల్లర నోట్లు లేదా అమ్మ బియ్యం డబ్బాలో దాచుకున్న డబ్బు కొట్టేయడం వంటి చిన్న చిన్న దొంగతనాలు చేయడం సర్వసాధారణమే.
కానీ స్కూలు ప్రిన్సిపల్ని హత్య చేసి ఆమె ఇంట్లో రెండు లక్షలు కొట్టేయడం మామూలు విషయం కానేకాదు. నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఈ దారుణానికి ఒడి గట్టారు.
తమ కోరికలు, విలాసాల కొరకు ‘సులువుగా డబ్బు సంపాదించడం ఎలా?’ అని యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వెతికారు. వారికి చదువుకోవాలనే శ్రద్ధ లేకపోగా అన్ని అవలక్షణాలు ఉండటంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి వారిద్దరినీ పలుమార్లు హెచ్చరించారు. కానీ వారి తీరు మారకపోవడంతో ఇటీవలే టీసీలు ఇచ్చేసి పంపించేశారు.
దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్న ఆ ఇద్దరు బాలురు, ముందుగా రెక్కీ నిర్వహించి, ఈ నెల 11న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. తర్వాత ఆమె ఇంట్లో బీరువాలు పగులగొట్టి సుమారు రెండున్నర లక్షలు దొంగతనం చేశారు.
వారు ఇంత తీవ్రమైన నేరం చేసినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలమని అనుకోవడం కౌమార్యంలో ఉండే అమాయకత్వమే అనుకోవాలి. కానీ మర్నాడే ఇద్దరూ పట్టుబడ్డారు.
ఆ వయసులో చిన్న చిన్న కోరికలు, సరదాలు ఉండటం మామూలే. కానీ ఆ వయసులోనే హత్యలు చేసి డబ్బు సంపాదించుకొని జల్సాలు చేయాలనే వారి ఆలోచనే.. సమాజంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో సూఛిస్తున్నట్లుంది.
వందలో 99 మంది విద్యార్ధులు మామూలుగానే ఉంటారు. కానీ మిగిలిన ఒక్క శాతంలో ఇలాంటి క్రిమినల్ మైండ్స్ ఉంటారని ఇది నిరూపిస్తోంది.
కనుక తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలకి మెచ్యూరిటీ వచ్చే వరకు నిశితంగా గమనిస్తూ, లోటుపాట్లు కనిపిస్తే ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండటం చాలా అవసరమే.





