ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మనకీ దుస్థితి

Nandamuri_Balakrishnaప్రముఖ తెలుగు సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు తెనాలి, పెమ్మసాని థియేటర్‌లో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు.

సినీరంగంలో ఉన్నా రాజకీయాలలో ఉన్నా ఎప్పుడు తెలుగు ప్రజలకు ఎ కష్టం వచ్చినప్పటికీ నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయపడే వ్యక్తి ఆయన. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కేంద్రంతోనే పోరాడారు. అటువంటి మహనీయుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను.

ADVERTISEMENT

సమాజమే దేవాలయం…ప్రజలే దేవుళ్ళు…అనే ఓ గొప్ప భావనతో ప్రజాసేవలో తరించారు మా తండ్రిగారు. అప్పటివరకు సమాజంలో నిరాదరణకు గురవుతున్న బడుగుబలహీనవర్గాల ప్రజలను ఆయన అక్కున చేర్చుకొని వారికీ సముచిత స్థానం కల్పించారు

అయన వారిపై అవ్యాజ్యమైన మమకారంతో అక్కున చేర్చుకుంటే, నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వారిని కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తూ నీచ రాజకీయాలు చేస్తోంది. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక్క చాన్స్ ఇచ్చినందుకు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే నేడు ఆంద్రప్రదేశ్‌ ఈ దుస్థితిలో ఉంది. ఇంతకు ముందు ఏవిధంగా ఉండేది ఇప్పుడు ఏవిధంగా ఉంది అని అందరూ తప్పక ఆలోచించుకోవాలని కోరుతున్నాను.

గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకం జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తికి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించుకోవాలి. అదే పొరపాటును మళ్ళీ మరోసారి చేస్తే ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం ఇక ఎన్నటికీ కోలుకోలేదు,” అని అన్నారు.

బాలకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అందరికీ తెలుసు. ఎవరైనా అధికారం చేపట్టగానే ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే నిర్మాణాత్మకమైన పనులు చేపట్టి అందరి మన్ననలు పొందాలని ప్రయత్నిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తెలుగుదేశం పార్టీ…దాని నేతలపై కక్ష సాధింపు చర్యలు, కూల్చివేతలతో విధ్వంసక పరిపాలన ప్రారంభించారు.

జోరుగా సాగుతున్న అమరావతి నిర్మాణపనులను ఎక్కడివక్కడ నిలిపివేయించేసారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు, అవినీతి జరిగిపోయాయంటూ పనులు నిలిపివేయించేసి రివర్స్ టెండరింగ్ అంటూ రివర్స్ పరిపాలన ప్రారంభించారు. కనీసం అక్కడితో ఆగినా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం నేడు ఈ దుస్థితిలో ఉండేది కాదు.

ఎన్నికల గురించి ఎంతో దూరదృష్టితో ఆలోచించి అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే సంక్షేమ పధకాలు అమలుచేస్తున్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వాటి కోసం చేస్తున్న అప్పులతో ఏదో ఓ రోజు రాష్ట్రం మునిగిపోతుందని గ్రహించాలేదంటే నమ్మశక్యంగా లేదు. అంటే ఆయనకు రాష్ట్రం కంటే మళ్ళీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా కొనసాగడమే ముఖ్యమని భావిస్తున్నారని భావించవచ్చు.

అయన మళ్ళీ అధికారంలోకి రావడం కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తూ మళ్ళీ ఆ భారాన్ని కూడా మళ్ళీ ప్రజలపైనే రుద్దుతూ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలకు నరకం చూపిస్తున్నారని చెప్పక తప్పదు.

ఒకవేళ ఈ సంక్షేమ పధకాలు, అప్పులు, బాదుడు, విద్యుత్ కోతలే చాలా బాగున్నాయని లబ్దిదారులు భావిస్తున్నట్లయితే తప్పకుండా వైసీపీకి దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories