ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న టిడిపి యువనేత నారా లోకేష్ స్థానిక మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొన్నారు. నారా లోకేష్ గత 50 రోజులుగా కుడిభుజం నొప్పితో బాధపడుతూనే, చెరగని చిర్నవ్వుతో పాదయాత్ర సాగిస్తున్నారు. ప్రతీరోజు పాదయాత్ర ముగిసిన తర్వాత క్యాంప్ సైట్లో నొప్పి నుంచి ఉపశమనం కొరకు ఫిజియో థెరపీ చేయించుకొంటున్నారు. నిన్న నంద్యాల నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారిలో కొందరు నారా లోకేష్తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడినప్పుడు తోపులాట జరిగింది. దానిలో నారా లోకేష్ కుడి భుజంపై ఒత్తిడి పడటంతో నొప్పి ఎక్కువైపోయింది. వైద్యుల సూచన మేరకు ఇవాళ్ళ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొన్నారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ, నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగించాలనుకొంటున్నారు. కనుక వైద్యులు కొన్ని మందులు ఇచ్చి, ఫిజియో థెరపీ, ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ థెరపీలను కొనసాగించాలని నారా లోకేష్కు సూచించారు. అనంతరం నారా లోకేష్ మళ్ళీ తన పాదయాత్రను ప్రారంభించారు.
నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి ఈ 103 రోజులలో 1,200 కిమీ పూర్తి చేసి త్వరలో 1,300 కిమీ మైలురాయిని చేరుకొనున్నారు. ఈ వేసవి మండుటెండల్లో రాయలసీమ జిల్లాలలో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయి. కనుక మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి తదుపరి క్యాంప్ సైట్ వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల గుండా 4,000 కిమీ పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద పూర్తిచేయనున్నారు.



