ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా జూన్ 29 మిగిలిపోనుంది. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రజలను గాలికొదిలేసిన ఆనాటి కాంగ్రెస్, నేటి బిజెపి ప్రభుత్వాలు సిగ్గుపడే విధంగా కేవలం రెండు సంవత్సరాలలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుని, ఏపీ నుండే పరిపాలన ప్రారంభించిన రోజుగా చరిత్రకెక్కిన రోజున ‘డబుల్ ఆఫర్’ తగిలింది అంటున్నారు ‘చినబాబు.’
ఏపీ నుండి పాలనే కాదు, ఈ ఉత్సాహభరితమైన వేళ… జగన్ ఆస్తులను ఈడీ సరైన టైమింగ్ లో అటాచ్ చేసింది… అంటున్నారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. “మన రాష్ట్ర పాలనా విభాగం ప్రారంభమైన రోజున మనకు డబుల్ ఆఫర్ తగిలింది… ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు…” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన నారా లోకేష్… “అవినీతి నాయకులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి వారు అర్హులు” అంటూ చెప్తూ ఈడీ జప్తు చేసిన అధికారిక నోటీసులను పోస్ట్ చేసారు.
నారా లోకేష్ చెప్తున్న ఈ ‘డబుల్ ఆఫర్’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం స్పష్టంగా కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకు అక్రమాస్తుల కేసుల విషయంలో ఎదురుదాడి చేసిన జగన్, ఇప్పుడు ఏకంగా సొంత ఇంటినే జప్తు చేసేందుకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. అటాచ్ మెంట్ జరిగిన తర్వాత ప్రస్తుతం నివాసం ఉంటున్న జగన్ లోటస్ పాండ్ ను వదిలి వెళ్ళాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు జగన్ నివాసానికి వచ్చిన ముప్పు లేకపోయినా… ఈ ప్రక్రియ ముందుకు వెళితే… ఖచ్చితంగా జగన్ నివాసానికి ఇబ్బందులు కలుగక తప్పని పరిస్థితి ఎదురు కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



