శిధిలాలపై కూర్చొని ఏం చేస్తావు?లోకేష్‌ సూటి ప్రశ్న

Nara-Lokesh_TDP

విశాఖ రాజధాని అంటూ వైసీపి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ చాలా నిశిత విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “మేము అమరావతిని రాజధానిగా ఉండాలనే అక్కడ సచివాలయం, శాసనసభ, హైకోర్టు వగైరాలన్నీ నిర్మించాము. జగన్మోహన్‌ రెడ్డి గత నాలుగున్నరేళ్ళుగా మేము కట్టిన ఆ సచివాలయంలోనే కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని పాలించడానికి అమరావతి పనికి రాదట! మళ్ళీ వందల కోట్లు ఖర్చుచేసి విశాఖ ఋషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించుకొంటున్నారు.

ADVERTISEMENT

ఐ‌టి కంపెనీల కోసం కట్టించిన మిలీనియం టవర్స్‌ వాటికి కేటాయించకుండా, వాటిలో ఉన్న ఐ‌టి కంపెనీలను కూడా ఖాళీ చేయించేసి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. మరో మూడు నెలల్లో గద్దె దిగక తప్పదు. మూడు నెలల ముచ్చట కోసం ఇన్ని వందల కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం అవసరమా?

రాష్ట్రానికి వేలకోట్లు ఆదాయం సమకూర్చిపెడుతున్న ఐ‌టి కంపెనీలను విశాఖ నుంచి పారిపోయేలా చేయడం ద్వారా జగన్‌ ఐ‌టి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సందేశం పంపుతున్నారో తెలుసా?ఆయన రాష్ట్రంలో చేస్తున్న విధ్వంసాన్ని చూస్తున్నవారు భవిష్యత్‌లో ఆంధ్రాలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టమంటే పెడతారా?ఆంధ్రాకి ఐ‌టి కంపెనీలు రమ్మంటే వస్తాయా? ఐ‌టి కంపెనీలంటే ఆంధ్ర అన్నట్లుండే పరిస్థితి నుంచి ఆంద్రా అంటే ఐ‌టి కంపెనీలు భయపడి పారిపోయేలా జగన్‌ చేస్తున్నారు.

సుప్రీంకోర్టు వారిస్తున్నా ఋషికొండని తవ్వేసి తన కోసం విలాసవంతమైన భవనాలు కట్టుకొన్నారు. హైకోర్టు స్టే విధించినా కైలాసగిరి కొండను కూడా తవ్వేస్తున్నారు. జగన్‌కు హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నా లెక్కలేదని నిరూపిస్తున్నారు.

మరో మూడు నెలల పాటు ఈ విధ్వంస పాలన భరించక తప్పదు. తర్వాత టిడిపి, జనసేనలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవడానికి మేము చాలా శ్రమించాల్సి ఉంటుంది,” అని నారా లోకేష్‌ అన్నారు.

ఒక రాష్ట్రం లేదా దేశం పునర్నిర్మాణానికి అనేక ఏళ్ళు పడుతుంది. కానీ కూల్చివేసుకోవడానికి నాలుగేళ్ళు చాలా ఎక్కువే. ఈ పదేళ్ళలో తెలంగాణ అభివృద్ధి చెందితే, ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర విభజనతో ఒకసారి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ఐదేళ్ళ వైసీపి పాలనలో మళ్ళీ నష్టపోయిందని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్‌ చెపుతున్నట్లు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయినా, టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ని గాడిన పెట్టుకోవడం చాలా కష్టమే!

ADVERTISEMENT
Latest Stories