టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 92 రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. సోమవారం 93వ రోజున కర్నూలు పట్టణంలోని ప్రసిద్ద కొండారెడ్డి బురుజు మీదుగా పట్టణ వీదులలో పాదయాత్ర చేస్తున్నారు. నారా లోకేష్ని కలిసి తమ సమస్యలు చెప్పుకొనేందుకు భారీగా జనం తరలివస్తుండటంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ జనంతో నిండిపోయాయి.
వైసీపీ ప్రభుత్వం కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని చెపుతుండగా, టిడిపి మాత్రం అమరావతి ఒక్కటే ఏపీకి రాజధానిగా ఉంటుందని, హైకోర్టు కూడా అక్కడే ఉంటుందని స్పష్టంగా చెపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నారా లోకేష్ కర్నూలులో పాదయాత్ర చేస్తున్నప్పుడు స్థానిక ప్రజలు ఆయనను న్యాయరాజధాని గురించి నిలదీసి అడగవచ్చు. కానీ నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి నేడు కర్నూలు పట్టణ ప్రజల వరకు రాయలసీమ జిల్లాల ప్రజలందరూ ఆయనకు దారి పొడవునా బ్రహ్మరధం పడుతున్నారు. అంటే రాయలసీమ ప్రజలు కూడా అమరావతినే రాజధానిగా కోరుకొంటున్నారని అర్దమవుతోంది.
మాట తప్పని, మడమ తిప్పమని గొప్పగా చెప్పుకొనే వైసీపీ మొదట్లో మూడు రాజధానుల పల్లవి ఎత్తుకొని నాలుగేళ్ళు గడిచేసరికి ‘కర్నూలు-న్యాయరాజధాని’ని పక్కన పెట్టేసి విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుందని చెపుతుండటం కూడా రాయలసీమ ప్రజల ఆగ్రహానికి ఓ కారణం అయ్యుండవచ్చు. కానీ టిడిపి మాట తప్పమని, మడమ తిప్పమని ప్రగల్భాలు పలకకపోయినా మొదటి నుంచి ఒకటే మాటకు కట్టుబడి ఉంది. అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెపుతోంది. బహుశః అందుకే రోజుకో మాట మాట్లాడే వైసీపీని నమ్ముకోవడం కంటే నిలకడగా ఉండే టిడిపిని నమ్ముకోవడమే మేలని రాయలసీమ ప్రజలు భావిస్తున్నారనుకోవచ్చు. అందుకే నేడు కర్నూలు పట్టణంలో నారా లోకేష్కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారనుకోవచ్చు.
కర్నూలు పట్టణంలోని వీధులలో నారా లోకేష్ పర్యటిస్తున్నప్పుడు స్థానిక ప్రజలు రోడ్లపక్క చెత్తకుప్పలు, పొంగి ప్రవహిస్తున్న మురుగు కాలువలను చూపించారు. పట్టణంలో 23వ వార్డులోకి వరదనీరు ప్రవహిస్తుండటంతో మురుగుకాలువలు నిండిపోయి ఆ నీరు రోడ్లపైకి ప్రవహిస్తోందని, తాము ఎన్నిసార్లు పిర్యాదులు చేస్తున్న అధికారులు, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయరాజధాని ఏర్పాటు సంగతి దేవుడెరుగు ముందు కర్నూలు పట్టణంలో ఈ చెత్తకుప్పలు, మురుగు కాలువలు శుభ్రపరచాలని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నిజమే కదా?



