టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి సోమవారం తిరిగి యువగళం పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుతో సుమారు రెండు నెలలు నారా లోకేష్తో సహా టిడిపి నేతలందరూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేయడంతో ఇప్పుడు వారిపై ఒత్తిడి తగ్గి మళ్ళీ రాజకీయంగా ముందుకు సాగేందుకు అందరూ సిద్దమవుతున్నారు.
యువగళం పాదయాత్రలో చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో వైసీపి ప్రభుత్వం ఆయనను ఏవిదంగా వేధించిందో నారా లోకేష్ పూసగుచ్చిన్నట్లు ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు కురిపించడం ఖాయం. యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో ఏర్పడిన సానుభూతి మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
కనుక యువగళం పాదయాత్రని అడ్డుకోవడానికి వైసీపి శ్రేణులను రంగంలో దించవచ్చు. లేదా పోలీసులతో అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చు. కనుక ఈసారి యువగళం పాదయాత్ర మునుపటి కంటే మరింత ఉద్రిక్తంగా మారవచ్చు. ఈ కారణంగా నారా లోకేష్, టిడిపి నేతలపి మరిన్ని కేసులు నమోదు చేయవచ్చు.
కానీ యువగళం పాదయాత్రని వైసీపి అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే దాని వలన టిడిపి పట్ల ప్రజలలో సానుభూతి, వైసీపి ప్రభుత్వం పట్ల విముఖత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక యువగళం పాదయాత్రతో టిడిపికి రాజకీయ మైలేజీ మరింత పెరుగుతుందా లేక నారా లోకేష్ మరిన్ని కేసులలో కూరుకుపోతారా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
యువగళం పాదయాత్రని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించాలని ముందు అనుకొనప్పటికీ, ఈ కేసులు, న్యాయపోరాటాలు, జనసేనతో సీట్ల సర్దుబాట్లపై చర్చలు వగైరాలను దృష్టిలో ఉంచుకొని యువగళం పాదయాత్రను డిసెంబర్ నెలాఖరున విశాఖపట్నంలో ముగించాలని టిడిపి నిర్ణయించింది.




