భారత ప్రధాని నరేంద్ర మోడీ మలివిడత మంత్రివర్గ విస్తరణలో దక్షిణాది వైపు చిన్న చూపు చూశారు. కేవలం బీజేపీ ఎంపీలకు మరియు ఉత్తరాదిన గల రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున ప్రమాణ స్వీకారం చేయగా, రాజస్థాన్ నుంచి నలుగురిని తీసుకున్నారు.
దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుండగా, కర్ణాటక నుంచి ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ఎంపీ రమేష్ చందప్ప జిగజినాగిని తన జట్టులోకి మోదీ తీసుకున్నారు. ఆయన మినహా దక్షిణాది నుంచి స్థానం పొందిన వారెవరూ లేకపోవడం గమనార్హం. ఇక బీజేపీకి కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తమకు క్యాబినెట్ పదవులు వద్దు, దానికి బదులుగా ఏపీకి మరింత ప్యాకేజ్ కోరినట్లుగా చంద్రబాబు స్పష్టం చేయడంతో ఏపీకి రావాల్సిన పదవులను చంద్రబాబే వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే, తెలంగాణలో మరింత బలంగా ఎదగాలన్న కోరికతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, రాష్ట్రంలోని ఏ నేతనూ తాజా విస్తరణలో తీసుకోకపోవడం గమనించదగ్గ విషయమే. ఇక అంతంత మాత్రం ప్రాతినిధ్యమున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మోడీ అసలు పరిగణనలోకే తీసుకున్నట్లే లేరు. మంత్రిపదవులపై ఏపీలో ఎలాంటి అసంతృప్తి లేకపోయినప్పటికీ, ఆశావహులు మాత్రం భంగపాటుకు గురయ్యారు.



