చిలకలూరి పేట లోని బొప్పూడి లో నిన్న రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ సభ అటు కూటమి వర్గీయులలో జోష్ నింపితే ఇటు వారి ప్రత్యర్థి వర్గమైన వైసీపీ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి.
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ కీచక పాలనపై, వారి ప్రభుత్వ విధానాల పై ప్రధాని మోడీ సాక్షిగా నిప్పులు చెరిగారు. హూ కిల్డ్ బాబాయ్…వివేకా హత్య ఉదంతం నుంచి, చెల్లెళ్ళ రాజకీయ తిరుగుబాటు వరకు ప్రస్తావించారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న రాజధాని , పోలవరం, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా వంటి అనేక సమస్యల మీద కూడా అధికార పార్టీ పై మండిపడ్డారు బాబు, పవన్ లు. వైసీపీ దాష్టికాలను తట్టుకోలేక అమర్ రాజా వంటి సంస్థలు రాష్ట్రాన్ని వదిలివెళ్లిన సంఘటనలను గూర్చి కూడా ప్రస్తావించారు.
ఇలా ఒక పక్క పెట్టుబడులను తరిమేస్తూ…మరో పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్న తీరుని, ప్రజల పై వేసిన పన్నుల భారాన్ని, జై బ్రాండ్ల మద్యంతో ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాన్ని ప్రజాగళం సాక్షిగా ప్రజలకు, ప్రధానికి వివరించారు బాబు
పవన్.
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, నాయకులు అవినీతిలో పోటీ పడుతున్నారు, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది, అభివృద్ధి చెందాల్సిన ఏపీని చూడాలనుకుంటే ఎన్డీయే కూటమిని ఆశీర్వదించాలంటూ, కాంగ్రెస్, వైస్సార్ కాంగ్రెస్ రెండు ఒకటే, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ఉద్దేశంతోనే ఏపీలో కాంగ్రెస్ తిరిగి రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందని వాటిని ప్రజలు తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు.
ఇలా పేట ప్రజాగళంలో బాబు, పవన్, మోడీ ముగ్గురు కూడా రాష్ట్ర పరిస్థితుల పట్ల ఉన్న వారి వారి అవగాహన బట్టి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసారు. అయితే ప్రజాగళం సభ మీద తమ గళం వినిపిస్తున్న వైకాపా నాయకులు ఒక పక్క చంద్రబాబు, పవన్ లు జగన్ పై విమర్శలు చేశారేంటి మా అధినేతను తిడతారా..? అంటూ టీడీపీ, జనసేన లపై ఎదురుదాడి చేస్తూ మరో పక్క మోడీ జగన్ ను ఉద్దేశించి ఒక్క తిట్టు కూడా తిట్టలేదు అంటూ సంబరపడిపోతున్నారు.
బాబు, పవన్ లు జగన్ ను తిట్టారంటూ వారి మీద పడి ఏడవడం ఎందుకు…మోడీ తిట్టలేదు అంటూ సంబరాలు చేసుకోవడం ఎందుకు.,మోడీ తన ప్రసంగంలో జగన్ ను తిడతారేమో అని భయపడ్డ వైకాపా నాయకులు జగన్ ను తిట్టలేదని ఆశ్చర్యపడుతున్నారా..? లేక ఆనంద పడుతున్నారా..? ఒకవేళ మోడీ జగన్ పై విమర్శలు చేసినా వాటిపై తిరిగి మోడీని విమర్శించే సాహసం జగన్ చేయగలుగుతారా..అంటే దానికి నూటికి నూరుపాళ్లు చేయలేరనే సమాధానమే వస్తుంది.
అయినా రాష్ట్రంలో జగన్ ను ఎవ్వరు తిట్టినా, జగన్ ప్రభుత్వం పై ఎవ్వరు విమర్శ చేసినా అందుకు కారణం చంద్రబాబే అంటూ ఆవు పాఠం చెప్పడం తప్ప వైకాపా నాయకులకు మరొకటి చేతకాదనేది గడిచిన పదేళ్లుగా చూస్తూనే వస్తున్నారు రాష్ట్ర ప్రజలు.




