జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కాసేపటి లోటస్పాండ్కు వెళ్లి జగన్ సమక్షంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నార్నే మాట్లాడుతూ … 10 సంవత్సరాలుగా తాను ముందు వైఎస్ తోనూ… ఆ తరువాత జగన్ తోనే ఉన్నా అని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా గెలిపించుకోవడం కోసమే పార్టీలో చేరా అని, రాష్ట్రానికి మేలు చేసేది జగనేనని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
గత ఎన్నికలలో కూడా నార్నే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సెగ ఎన్టీఆర్ కు కూడా తగిలింది. గత కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఉద్దేశపూర్వకంగానే మామను వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపునకు పంపారని ఆరోపణలు వచ్చాయి. అయితే వివాదాల కారణంగానో మారే కారణంగానో ఆయన రాజకీయ అరంగేట్రం ఆగిపోయింది. హరికృష్ణ హఠాన్మరణం అనంతరం ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కాస్త దగ్గరయ్యారు.
ఆయనకు బాలయ్య కుటుంబానికి కొంత రాకపోకలు పెరిగాయి. అయితే ఆయన పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇటీవలే ఆయన అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే జూనియర్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కేవలం ట్విట్టర్ లో మద్దతు ఇవ్వడంతోనే సరిపెట్టారు. ఈ క్రమంలో మామ చేసిన ఈ పని ఎన్టీఆర్ కు కొత్త చిరాకు తెచ్చిపెడుతుందా? నార్నే గనుక వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తే జూనియర్ కు అది ఇబ్బందిగా పరిణమించవచ్చు.



