నీట్ పేరుతో సీజేపీ ఆందోళనల వెనుక బలమైన రాజకీయాలున్నాయని చెప్తే చాలా మందికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు. కానీ పార్లమెంటులో నిన్న రాత్రి 11 గంటల వరకు, మళ్ళీ నేడు ఉదయం నుంచి ఇంతవరకు అధికార, ప్రతిపక్షాల మద్య సాగుతున్న వాగ్వాదాలే ‘నీట్ ఆందోళనలు’ రాజకీయ ఆధిపత్యపోరులో భాగమేనని స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం సీజేపీ షరతులన్నిటికీ అంగీకరించిన తర్వాత ఆందోళనలు విరమిస్తున్నామని చెప్పిన అభిజిత్ దీప్కే, మర్నాడు కూడా ఇది మొదటి వికెట్ మాత్రమే ఇంకా చాలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశం కూడా సీజేపీ వెనుక రాజకీయ పార్టీల హస్తం, ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని స్పష్టం చేస్తోంది.
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అవడం నిజంగా సిగ్గుచేటే. ఈ కారణంగా ఆందోళనలు జరగడం, విద్యార్ధులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, చివరికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మోడీ ప్రభుత్వ ప్రతిష్టని మసక బార్చేవే.
అయితే సీజేపీ ఆందోళనలు మొదలుపెట్టక ముందే మోడీ ప్రభుత్వం, నష్ట నివారణ చర్యలు చేపట్టి ఉంటే ఈ అంశంపై కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఇంత రాజకీయాలు చేసేందుకు అఇంత వకాశం లభించేదే కాదు. వాటికి ఇంత రాజకీయ మైలేజ్ లభించేది కాదు. అది వేరే విషయం.
కానీ మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమన్నట్లు వాదించిన కాంగ్రెస్ మిత్ర పక్షాలు, ఇప్పుడు పార్లమెంటులో విద్యార్ధులపై లాఠీఛార్జి చేయడం గురించి మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
సీజేపీ ఆందోళనలు విరమించినా, కాంగ్రెస్ మిత్రపక్షాలు ఊరుకోవు.. ఈ ఆందోళనలు లేదా ఈ చర్చ వీలైనంత ఎక్కువ కాలం కొనసాగించేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో మోడీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి రాజకీయంగా పైచేయి సాధించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాయని ముందే చెప్పుకున్నాము. ఇప్పుడు అదే జరుగుతోంది కదా?
ఈ చర్చని కొనసాగిస్తే ఎటువంటి ప్రతిఫలం లభిస్తుందో కాంగ్రెస్ మిత్ర పక్షాలకు బాగా తెలుసు. వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో మోడీ ప్రభుత్వానికి బాగా తెలుసు.
కనుక రాజకీయ పార్టీల ప్రోద్బలంతో విద్యార్ధులు ఆవేశంగా వాటి రాజకీయాలలో తలదూర్చితే వారే నష్టపోతారు తప్ప ఆ పార్టీలు కావు. విద్యార్ధులు అనుకున్నది సాధించినా, సాధించలేకపోయినా అధికార ప్రతిపక్షాలకు ‘ఫరక్’ పడదు. మరో 10-20 ఏళ్ళ వరకు ఆ తర్వాత కూడా అవి ఇలాగే రాజకీయాలు చేసుకుంటూ మనుగడ సాగిస్తుంటాయి.
కానీ ఒక్క పోలీస్ కేసులో చిక్కుకుంటే ఉజ్వల భవిష్యత్ కలిగిన విద్యార్ధుల జీవితాలు నాశనమయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని ప్రతీ ఒక్కరూ గ్రహించడం చాలా అవసరం.
చివరిగా ఒక మాట. యువత రాజకీయాలలోకి రావడం చాలా అవసరమే. కానీ ముందు చదువులు పూర్తి చేసుకొని వస్తే దేశానికి మరింత సమర్ధంగా సేవ చేయగలుగుతారు.




