తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఉద్వాసనపై ఎంతగా చర్చ జరిగిందో అంత త్వరగా ఆ చర్చ చల్లారిపోయింది. రాజకీయాలలో ఇది చాలా సహజమే. అయితే అటువంటి క్లిష్ట సమయంలో సదరు రాజకీయ పార్టీ, నేత ఏవిధంగా స్పందిస్తారనేదే చాలా కీలకం.
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆమె ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పగా, బిజేపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆమెకు తలుపులు మూసేశాయి. కనుక ఆమెకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తప్ప మరో దారి లేదు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడం చాలా ఉపశమనం ఇస్తుంది. తన అనుచరులతో చర్చించిన తర్వాత ఆమె ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఆమెను మంత్రి పదవిలో నుంచి తొలగించినందున దానికి పరిహారంగా పార్టీలో మరో పదవి కట్టబెట్టేందుకే కొండా సురేఖను ఢిల్లీకి పిలిచి ఉండవచ్చు.
అయితే ఆమెను మంత్రి పదవిలో నుంచి తొలగించాలని పట్టుబట్టిన సిఎం రేవంత్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారనేది చాలా ఆసక్తికరం. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేనివిధంగా ఆమెకు పదవి లేదా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే ఆమె ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కథ మొదటికొస్తుంది.
కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయం బాగా తెలుసు. కనుక కొండా సురేఖని గట్టిగా హెచ్చరించి తగిన పదవి లేదా హామీ ఇచ్చి పంపించవచ్చు.





