తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్యకు ముచ్చెమటలు పట్టిస్తుండటం విశేషం.
గురువారం నాయుడుపేట పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నెలవల సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ, “ఈ మూడేళ్ళలో వైసీపీ ఎమ్మెల్యే సంజయ్య నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పగలరా?ఆనాడు మా టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయి తప్ప నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క అభివృద్ధి పని జరుగలేదు. ఎమ్మెల్యేకు దమ్ముంటే నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాను. అభివృద్ధి గురించి ఆలోచించవలసిన ఎమ్మెల్యే సంజయ్య ఎప్పుడూ రాజకీయాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. అందుకే ఈ నియోజకవర్గం ఇలా ఉండిపోయింది.
ఆయన కనుసైగ చేస్తే టిడిపి నేతలదరూ కట్టకట్టుకొని వైసీపీలో చేరిపోతారని గొప్పలు చెప్పుకొంటున్నారు. దమ్ముంటే నియోజకవర్గం ఒక్క టిడిపి కార్యకర్తనైనా మీ పార్టీలో జేర్పించుకోగలరా?అని సవాలు విసురుతున్నాను. ఆయన దగ్గర వైసీపీలో చేరాలనుకొంటున్న టిడిపి నేతల జాబితా ఉందని చెపుతున్నారు. దమ్ముంటే ఆ జాబితాను బయటపెట్టాలని సవాలు చేస్తున్నాను. అయినా వైసీపీ ఓ టైటానిక్ షిప్ వంటిది. దానికి సిఎం జగన్మోహన్ రెడ్డి కెప్టెన్. అటువంటి మునిగిపోయే షిప్పులో ఎక్కేందుకు ఎవరు సాహసిస్తారు? ముందు దానితో పాటు మీరందరూ మునిగిపోకుండా జాగ్రత్తపడితే మంచిది,” అని ఎద్దేవా చేశారు.
ఈ మీడియా సమావేశంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు కందుల కృష్ణారెడ్డి, టిడిపి నాయకులు వెంకటాద్రి, వెంకటేశ్వర్లు, దార్ల రాజేంద్ర, మానూరు వెంకటేశ్వర్లు, చరణ్, ఖలీల్, పునీత్ సాయి, సులేమాన్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.



