ఏపీ, తెలంగాణ లేదా దక్షిణాది రాష్ట్రాలలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, చివరికి బీజేపి పాలిత ముఖ్యమంత్రులు వచ్చి వాలిపోతుంటారు.
అలాగే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీతో సహా ఆ పార్టీలో అతిరధ మహారధులందరూ కూడా వచ్చి వాలిపోతుంటారు.
ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతలు బీహార్ రాష్ట్రంలో చాలా బిజీబిజీగా తిరుగుతున్నారు. ఎందుకంటే అక్టోబర్-నవంబర్ నెలలలో శాసనసభ ఎన్నికలున్నాయి కనుక!
ఇప్పుడు బీహార్లో ఏ ఊర్లో చూసినా ఏ సందులో చూసినా వారే కనిపిస్తున్నారు. ఎన్నికలయ్యే వరకు అందరూ అక్కడే ఉంటారు.
బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో భారీ వర్షాలు పడకుండా ఆగిపోవు. వరదలు ఊళ్ళను ముంచెత్తకుండా విడిచిపెట్టవు… అని వారికీ తెలుసు. కానీ వారికి సమయం లేడిప్పుడు. అసలు ఈ వరద కష్టాలు, పరామర్శలు వారి అజెండాలోనే లేవు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఇటువంటి కష్టకాలంలో వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి, కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. వారి ఋణం ఉంచుకోరు. కానీ అందరూ బీహార్లో బిజీగా ఉన్నారు.
తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఇద్దరు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనుక వారి ద్వారానైనా వరద భాదిత ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉందని తెలియజేయవచ్చు. కానీ వారు కూడా బిజీ!
తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తుండేవారు. కానీ అయన కూడా బిజీ.. కనుక రాలేరు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా బీహార్లో ఓ రౌండ్ వేసినప్పటికీ అందరూ హైదరాబాద్ తిరిగివచ్చారు. కనుక వారైనా ప్రజల వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పి అవసరమైన సహాయ సహకారాలు అందించవచ్చు. కానీ వారు సచివాలయంలో సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు, టీడీపి నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల మద్యనే ఉంటారు. అందుకే ప్రజలు వారిని ఆదరించి అధికారం కట్టబెట్టారు.
చంద్రబాబు నాయుడు చాలా ద్వేషించే కేసీఆర్ కూడా ఈ విషయం బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే తక్షణం పార్టీ నేతలందరూ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
ఆయన ఆదేశం మేరకు తక్షణమే బీఆర్ఎస్ నేతలు ప్రజల వద్దకు వెళ్ళారు. కనుక ఏపీలో జరిగిందే రేపు తెలంగాణలో కూడా జరిగినా ఆశ్చర్యం లేదు.




