జగన్ని గుడ్డిగా నమ్మడం వలన వైసీపి నేతలందరూ నష్టపోయారు. అధికారంలో ఉన్నప్పుడు వారందరూ బాగానే వెనకేసుకున్నారు కనుక వారికేమీ ఇబ్బంది ఉండదు. కానీ కేవలం రూ.5,000 జీతం కోసం వైసీపికి 5 ఏళ్ళు వెట్టి చాకిరీ చేసి, వైసీపి నేతల బెదిరింపులకు భయపడి ఆ ఉద్యోగాలను కూడా వదులుకున్న వాలంటీర్లు ఇప్పుడు రోడ్డున పడ్డారు!
ఈవీఎంలు, ఋషికొండ ప్యాలస్ గురించి మాట్లాడుతున్న జగన్, వైసీపి నేతలలో ఏ ఒక్కరూ కూడా వాలంటీర్ల సమస్య గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు… ఎందువల్ల?
ఎన్నికలకు ముందు వారిచేత బలవంతంగా రాజీనామాలు చేయించిన వైసీపి నేతలే ఇప్పుడు వారిని చూసి చీదరించుకుంటుంటే, ఏమి చేయాలో పాలుపోక టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ, తమని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోవాలని ప్రాధేయపడుతున్నారు.
ఇది చూస్తున్నప్పుడు ఎవరికైనా మనసు చివుక్కుమనిపిస్తుంది. కానీ వారిని 5 ఏళ్ళు వాడుకున్న జగన్, వైసీపి నేతలకు కనీసం చీమ కుట్టిన్నట్లు అనిపించడం లేదు!
మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ తమ హయాంలో అనేక పరిశ్రమలు రప్పించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్పుకున్నారు.
కానీ కేవలం రూ.5,000 జీతాల కోసం నేటికీ ఇన్ని లక్షల మంది ఆరాటపడుతున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతేకాదు… జగన్ వలననే ఇప్పుడు ఒకేసారి 1.08 లక్షల మంది వాలంటీర్లు నిరుద్యోగులుగా మారారు కూడా!
అసలు చట్ట బద్దత లేని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే తప్పు. వారి చేత 5,000 జీతాలకు వెట్టి చాకిరీ చేయించుకోవడం, ఎన్నికలకు ముందు వారిని బెదిరించి ఆ ఉద్యోగాలకు కూడా రాజీనామాలు చేయించడం, ఇప్పుడు రోడ్డునపడిన వారిని పట్టించుకోకపోవడం అన్నీ తప్పులేగా?
ఈ వాలంటీర్ వ్యవస్థను సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? కానీ ఎందుకు స్పందించడం లేదు?
ఈ 5 ఏళ్ళలో వాలంటీర్లలా గడపగడపకు వెళ్ళి అందరినీ పలకరిస్తూ సేవలు అందించారు. కనుక ప్రజలకు ఇంతగా సేవ చేసిన వాలంటీర్లకు ఇప్పుడు ప్రజా కూటమి ప్రభుత్వమే మానవతా దృక్పదంతో ఏదో విదంగా జీవనోపాధి కల్పించి ఆదుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు.






