ఎన్నాళ్లగానో వేచి చూసిన తెలంగాణ కేబినెట్ విస్తరణ మొత్తానికి జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కాసేపటి క్రితం కొత్త మంత్రుల చేత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు ఈ విస్తరణలో చోటు దక్కకపోవడం విశేషం. ఇప్పటికే ఉన్న కేసీఆర్, మహమూద్ అలీలతో కలిపి మొత్తానికి 12 మంది మంత్రులు కేసీఆర్ కేబినెట్ లో కొలువు తీరినట్టు అయ్యింది. గత టర్మ్ లో చోటు దక్కని మహిళా మంత్రికి ఈసారి కూడా చోటు దక్కలేదు.
అలాగే గిరిజన కోటాని కూడా భర్తీ చెయ్యలేదు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇంకో విస్తరణ ఉంటుందని ఆ విస్తరణలో వారికి చోటు దక్క వచ్చని తెలుస్తుంది.కేబినెట్ లో ఈ సారి మొత్తానికి ఆరుగురు కొత్త మొఖాలు ఉండడం గమనార్హం. అంటే మొత్తం కేబినెట్ లో సగం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కీలక పాత్ర పోషించే కమ్మ కులస్థులకు ఈ సారి చోటు దక్కలేదు. ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వర రావు గెలవకపోవడం ఇక ఆ అవకాశం రాలేదు. పాత జిల్లాలలో ఖమ్మం కు అసలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
అదే సమయంలో కేసీఆర్ కేబినెట్ లో అత్యధికంగా ఐదుగురు రెడ్ల కు అవకాశం దక్కింది. మిగతా వారిలో ముగ్గురు బీసీలు, ఇద్దరు వెలమ (ముఖ్యమంత్రితో కలిపి), ఒక ఎస్సీ, ఒక ముస్లిమ్ కు అవకాశం దక్కినట్టు అయ్యింది. గతంలో వెలమలు, కమ్మలను కలిపి వెల్కమ్ అనే కొత్త రాజకీయ ప్రయోగం చేస్తారని వదంతులు వినిపించిన తరుణంలో కమ్మ వారిని మొత్తానికి పక్కన పెట్టడం విశేషం.



