వైకాపా అధినేత వైఎస్ జగన్ సతీమణి, సాక్షి మీడియా సంస్థల చైర్మన్ వైఎస్ భారతీ రెడ్డి, సాక్షి దినపత్రిక చీఫ్ ఎడిటర్ కే.రామచంద్రమూర్తిలను ఈ నెల 16లోగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ నూజివీడు రెండవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లు పోలీసుల చేతికి అందాయి. గత నెల 26వ తేదీన న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా, అవి అధికారికంగా హనుమాన్ జంక్షన్ పోలీసుల చేతికి బుధవారం నాడు వచ్చినట్టు తెలుస్తోంది.
గత సంవత్సరం సాక్షి పత్రికలో విజయ డెయిరీ డైరెక్టర్ చలసాని ఆంజనేయులుపై ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై చలసాని పరువు నష్టం దావా వేయగా, భారతి, రామచంద్రమూర్తి తరఫున ఏ న్యాయవాదీ ప్రత్యేక వకాల్తా దాఖలు చేయలేదు. దీంతోనే వారెంట్లు జారీ అయ్యాయి. వీటిపై జిల్లా ఎస్పీ, డీజీపీలతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని, కోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతి, రామచంద్రమూర్తిలను నూజివీడుకు తీసుకురావడం తప్పకపోవచ్చని, త్వరలోనే వారెంట్లు తీసుకుని హైదరాబాద్ కు బయలుదేరే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.





