అయస్కాంతం (మాగ్నెట్)లో రెండు ముక్కలు ఒకవైపు పెడితే ఆకర్షించుకుంటాయి. అదే మరోవైపు తిప్పి పెడితే వికర్షించుకుంటాయి. కానీ ఇనుప ముక్కను ఎటువైపు పెట్టినా ఆకర్షిస్తాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సరిగ్గా ఇలానే సాగింది.
రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కియా వంటి అనేక పరిశ్రమలను అయస్కాంతంలా ఆకర్షించి రాష్ట్రానికి రప్పించారు.
ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు అయస్కాంతం ముక్కలు వికర్షించుకున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఆయన పరిశ్రమలను అయస్కాంతంలా ఆకర్షించి రాష్ట్రానికి రప్పిస్తున్నారు.
వాటిలో నిజంగానే అయస్కాంతం తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది. తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామికవాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో ఎన్ఏఎన్ గ్రీన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అయస్కాంతాలు తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు అవసరమైన అయస్కాంతాలు దీనిలో తయారు చేస్తారు.
ఇప్పటికే మేనకూరులో ఈ సంస్థ లిథియం అయాన్ బ్యాటరీలు తయారుచేస్తోంది. ఇప్పుడు దీనికి అనుబంధంగా 25 ఎకరాల్లో ఈ అయస్కాంతాలు తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్రంలో దీనికి అవసరమైన ముడి ఖనిజం పుష్కలంగా ఉంది. అందుకే ఈ సంస్థ ఏపీని.. మేనకూరును ఎంచుకుంది. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
మొదటి దశలో ఏడాదికి 1,200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ఏడాదికి 10,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసేందుకు విస్తరణ చేపడుతుంది.
ఇప్పటి వరకు ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు అవసరమైన అయస్కాంతాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. కానీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి కాబోతున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి మాగ్నెట్ థెరపీ చేస్తూ మూడు రాజధానులు లేకుండానే రాయలసీమ జిల్లాలను ఇలా అభివృద్ధి చేస్తున్నారే!





