బులుగు..తెలుపు..ఆకుపచ్చ ‘మూడు’ రంగుల కలయికతో పుట్టిన వైసీపీ జెండా మూడు పార్టీల కలయికతో, ముగ్గురు వ్యక్తుల శాపాలతో, మూడు నిర్ణయాలతో నిండా మునిగింది. ‘YSR ‘అనే మూడు అక్షరాల విలువతో వైసీపీ ని స్థాపించిన జగన్ ఆంధ్రప్రదేశ్ లో ‘మూడు’ రాజధానులు అంటూ మూడు ముక్కలాట మొదలుపెట్టి ‘మూడు’ ప్రాంతాలలో విధ్వంసం సృష్టించారు.
2019 లో వైసీపీ గెలుపుకి ప్రత్యక్షంగా షర్మిల, పరోక్షంగా కేసీఆర్, మోడీ సహకారం ఉండడంతో ‘పదవి’ అనే మూడక్షరాల అధికారం జగన్ చేతికొచ్చింది. అయితే చేతికొచ్చిన ఆ పదవిని అడ్డుపెట్టుకుని జగన్ తీసుకున్న మూడు రాజకీయ నిర్ణయాలు వైసీపీ భవిష్యత్ ను పాతాళానికి నెట్టింది.
* మొదటగా…మూడు రాజధానుల నిర్ణయం. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొన్ని భవిష్యత్ తరాలు అనుభవించాల్సి వచ్చింది.
* రెండవది…చంద్రబాబు నాయుడు అరెస్టు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా వైసీపీ పునాదులు కదిలించిందనే చెప్పాలి.
* మూడవది…పవన్ కళ్యాణ్ నిర్బంధం. ఎక్కడిక్కడ పవన్ కళ్యాణ్ పై ఉక్కుపాదం మోపుతూ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైసీపీ పతనానికి నాంది పలికిందనే చెప్పాలి.
ముఖ్యంగా బాబు అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ 9 అర్ధరాత్రి పోలీసులను ప్రయోగించి పవన్ ను కట్టడి చేయాలి అని చూసిన జగన్ ఆ రాత్రే వైసీపీకి కాళరాత్రిగా మార్చేశారు. జగన్ తీసుకున్న ఈ మూడు నిర్ణయాలు వైసీపీ పతనానికి మూలస్తంభాలు.
ఇక రాష్ట్రంలో వైసీపీ విధ్వంసానికి ముగింపు పలకడానికి ‘మూడు’ పార్టీల కలయిక అనివార్యమని భావించిన పవన్ జనసేనతో, టీడీపీ పొత్తు ప్రకటించి బీజేపీని కలుపుకొచ్చారు. ఈ ‘మూడు’ పార్టీల కలయిక వైసీపీ మూడు రంగుల జెండాను అధికారానికి దూరం చేసింది.
దీనికి తోడు జగన్ అధికారమనే అహంకారంతో సొంత కుటుంబంలోని ముగ్గురు మహిళలతో శత్రుత్వం పెట్టుకుని వారి శాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఆడవారి పై రాజకీయం చేసి పైశాచిక ఆనందం పొందిన జగన్ పతనానికి ఆ ముగ్గురు ఆడవారి ఉసురే కారణమని వైసీపీ సొంత వర్గం సైతం వాపోతున్నారు.
తన గెలుపుకు కారణమైన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల పట్ల జగన్ ప్రవర్తించిన తీరు, తన సొంత బాబాయ్ కుమార్తె సునీత పట్ల జగన్ వ్యవహరించిన విధానం సమాజంలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది. ఈ ముగ్గురు కన్నీళ్లు వైసీపీ ప్రభుత్వ ముచ్చటను మట్టికరిపించింది.
మూడు పార్టీల కలయిక, ముగ్గురు వ్యక్తుల ఉసురు, జగన్ తీసుకున్న మూడు నిర్ణయాలతో ఏపీలో ప్రజల ‘మూడు’ మారి వైసీపీ మూడు రంగుల జెండాను, YSR అనే మూడక్షరాల విలువను అధః పాతాళానికి నెట్టేసింది. దీనితో ‘మూడు’ వైసీపీ పాలిట మృత్యువు గా మారిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




