హైదరాబాద్లో వర్షం పడితే అది కూడా మీడియాలో ప్రధాన వార్త అవుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురుస్తోంది. ఎంతగా అంటే మనుషులు, వాహనాలు కొట్టుపోయే అంత!
రాంనగర్లో ఓ వ్యక్తి స్కూటీపై వెళుతుండగా వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతనిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా కొట్టుకుపోయేవారే కానీ అదృష్టం కొద్దీ ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు!
వారేమీ నదిలోనో చెరువులోనే పడి కొట్టుకుపోలేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే రాంనగర్లో నడిరోడ్డుపై కొట్టుకుపోయారు! ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ కళ్ళ ఎదుట జరిగింది కనుక నమ్మక తప్పదు.
గత పదేళ్ళలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చేశారు. ఆయన కుమారుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 35 ఫ్లైఓవర్లు నిర్మింపజేశారు కూడా.
అయినా భారీ వర్షం పడితే హైదరాబాద్ నగరం నీట మునగాల్సిందే. రోడ్లపైనే ప్రజలు, వాహనాలు కొట్టుకుపోతూనే ఉంటారు. రోడ్లపై మ్యాన్ హోల్స్, పక్కనే పొంగిపోర్లే కాలువలలో పడి ఏటా ప్రజలు, చిన్నారులు చనిపోతూనే ఉన్నారు.
హైదరాబాద్లో నెలకొన్న ఈ పెద్ద సమస్యని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ పరిష్కరించలేకపోయారు. కానీ సమస్య పరిష్కారానికి కొన్ని గట్టి ప్రయత్నాలు, చర్యలే చేపట్టారు. లేకుంటే నేడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది.
హైదరాబాద్లో ఈ దుస్థితి చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మన అమరావతి రాజధాని గురించి ఆలోచన రాక మానదు. అయితే హైదరాబాద్ ఏడున్నర దశాబ్ధాలలో క్రమంగా విస్తరిస్తూ ఈ స్థాయికి అభివృద్ధి చెందింది. కనుక అది ప్లాన్డ్ సిటీ కాదు కనుక ఇటువంటి సమస్యలు సహజమే.
కానీ మన అమరావతి భూసేకరణ చేసి విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వగైరాలతో నిర్మిస్తున్న ప్లాన్డ్ సిటీ. ముఖ్యంగా కృష్ణనదికి అతి సమీపంలో దీనిని నిర్మిస్తున్నారు. అయినప్పటికీ ఎంత భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ అమరావతిలో ఇటువంటి సమస్యలు ఎదురవకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని డిజైన్ చేయించి నిర్మిస్తున్నారు.
అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఎన్నికలనాటికి అమరావతికి కొంత రూపు రేఖలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ 5 ఏళ్ళలో రాజధాని అమరావతి ఇటువంటి ఆటుపోట్లను ఏవిదంగా తట్టుకుంటుందో కూడా తెలిసిపోతుంది.






