అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తాను 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే దానిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ నుండి పోటీ చేసేది ఫిబ్రవరిలో ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. గతంలో జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆ మాట ఎత్తలేదు. దీనితో ఆయన రాయలసీమ నుండి పోటీ చెయ్యడం అనుమానమే అని విశ్లేషకుల అభిప్రాయం.
[m9ad]
ఉభయగోదావరి జిల్లాలలో ఎక్కడ నుండైనా పోటీ చేస్తే గెలుపు సునాయాసమని, అదే సమయంలో ఆయన పోటీ ప్రభావం చుట్టు ప్రక్కల నియోజకవర్గాలపై కూడా ఉంటుందని జనసేనాని భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే గతంలో చిరంజీవి పశ్చిమ గోదావరిలోని పాలకొల్లు నుండి పోటీ చేసి ఓడిపోవడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో తొందరపాటు కూడదని ఆయన అనుకుంటున్నారట. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఫిబ్రవరిలో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు జనసేనాని.
అప్పట్లో చిరంజీవి పోటీ చేసినట్టు కోస్తా (పాలకొల్లు), రాయలసీమలోని (తిరుపతి) రెండు చోట్ల పోటీ చేసే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అయితే అప్పట్లో తిరుపతిలో రెండు చోట్ల గెలిస్తే ఇక్కడ రాజీనామా చేస్తారు అని, పాలకొల్లులో రెండు చోట్ల గెలిస్తే ఇక్కడ రాజీనామా చేస్తారు అంటూ ప్రత్యర్థి పార్టీలు ఓటర్లను అయోమయానికి గురి చేశాయి. దీని వల్లే చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారని, కావున అది అంత శ్రేయస్కరం కాదని పవన్ ప్రాధమిక అభిప్రాయం అని తెలుస్తుంది.



