వాల్తేర్ వీరయ్య, దేవర, తాజాగా తండేల్… ఈ మూడు సినిమాలలో కామన్ ఏమిటంటే మూడూ సముద్రం మీద జరిగే పోరాటాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా అలాంటి స్టోరీతో సినిమా మొదలుపెట్టలేదు కానీ అప్పుడే బోటు ఎక్కేశారు. కనుక సముద్రంపై ఆయనతో పోరాడేందుకు వైసీపి నేతలు కూడా హడావుడిగా బోట్లు ఎక్కేశారు!
ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బరులో లంగరు వేసున్న ఓ బోటులో మంటలు చెలరేగడంతో అవి పక్కనే ఉన్న బోట్లకు వ్యాపించగా ఆ అగ్నిప్రమాదంలో సుమారు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ప్రమాదాన్ని జనసేనకు ముడిపెట్టడంతో వైసీపి, జనసేనల మద్య సముద్రంపై పోరాటం మొదలైంది. పవన్ కళ్యాణ్ వెంటనే ఆ ఆరోపణలను ఖండించడమే కాకుండా, పోలీసులతో దర్యాప్తు జరిపించి దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేయడంతో వైసీపి కంగు తింది.
ఆయన అక్కడితో ఊరుకొంటే వైసీపి ఇంత హడావుడి పడేదే కాదు. కానీ అగ్నిప్రమాదంలో కాలిపోయిన బోట్ల యజమానులు ఒక్కొక్కరికీ జనసేన తరపున రూ.50,000 చొప్పున ఆర్ధికసాయం అందిస్తానని, రెండు మూడు రోజులలో తానే స్వయంగా వచ్చి చెక్కులు ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ మత్స్యకారులను కలిసేందుకు విశాఖ వస్తే, వారికి ఆయన రూ.50 వేలు చొప్పు ఇచ్చేస్తే… అంటూ వైసీపి ఓట్లు కూడికలు తీసివేతల లెక్కలు వేసుకొనే ఉంటుంది.
బహుశః అందుకేనేమో ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి జగన్ వెంటనే నష్టపరిహారం ప్రకటించడం, గంటల వ్యవధిలో విశాఖ జిల్లా కలక్టర్ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమా చేయడం, వెంటనే చెక్కు తయారుచేయడం చకాచకా జరిగిపోయింది.
ఉత్తరాంద్ర వైసీపి నేతలందరూ ఆ చెక్కు పట్టుకొని గురువారం ఉదయం ఫిషింగ్ హార్బర్ చేరుకొని దానిని బాధితుల చేతిలో పెట్టి ఫోటోలు దిగేశారు. తర్వాత కాసేపు జగన్ భజన కార్యక్రమం జరిగింది.
అయితే ఈ క్రెడిట్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్దే అని చెప్పక తప్పదు. ఆయనే కనుక బాధితులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చెక్కుకు బదులు ‘లోకల్ బాయ్ నాని’ జనసేనకు ముడిపెట్టి పోలీసుల విచారణ, కేసుల నమోదు కధ నడుస్తుండేది.
కానీ పవన్ కళ్యాణ్ వస్తే విశాఖలో ఓట్ల లెక్కలు, ముఖ్యంగా మత్స్యాకారుల ఓట్లు చేజారిపోతాయనే దూరాలోచనే వైసీపిని పరుగులు తీయించిందని చెప్పక తప్పదు. కనుక వైసీపి నష్టపరిహారం క్రెడిట్ ఆయనదే… నో డౌట్!




