తమ అభిమాన హీరో సినిమాలకు గుడ్ బై చెప్తారంటూ వచ్చిన వార్తలపై పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ‘జనసేన’ పార్టీ వ్యవస్థాపన కోసం 2018 నుండి రాజకీయాలపై దృష్టి సారిస్తారని, అప్పటివరకు మాత్రమే సినిమాలలో నటిస్తారని, గత రెండు, మూడు రోజులుగా వచ్చిన వార్తలు తెలిసినవే. ఓ పక్కన ‘జనసేన’ ద్వారా ప్రజల్లోకి వస్తున్నారనే విషయం సంతోషం కలిగించినా, మరో పక్కన సినిమాలకు పూర్తిగా దూరం కానున్నారనే టాక్ నిరుత్సాహానికి గురి చేస్తోంది.
అసలు పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఏం కావాలనుకుంటున్నారు? సినిమాలలో నటిస్తే చాలా? లేదా ‘జనసేన’ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే కోరుకుంటున్నారా? లేక రెండింటిని చేయాలనుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా చివరిదే తమ సమాధానం అని అభిమానులు చెప్తారు. అయితే, మరోవైపు పవన్ మాత్రం రెండు పడవలపై కాలు మోపేది లేదని గతంలోనే స్పష్టం చేసారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.
బహుశా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అప్పుడే పవన్ అభిమానుల ముందుకొస్తారు. ఆ సమయంలో తన తదుపరి సినిమాలపై ఒక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు గానీ, పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడి నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.





