2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన సిపిఎస్ రద్దు హామీని జగన్ మేము అధికారంలోకి వచ్చిన రెండు వారాలలో పూర్తి చేసేస్తాం…ఆ విషయం ఇక మీరు మర్చిపోండి అన్నా అంటూ బహిరంగ వేదిక మీద ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న ఎంతవరకు అమలులోకి వచ్చిందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎరుకే.
అయితే ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సకల శాఖ మంత్రి సజ్జల మాట్లాడుతూ జగన్ చిన్న పిల్లాడని, దీని మీద ఏమాత్రం అవగాహనా లేకుండా హామీ ఇచ్చాడని, అమాయకుడని, ఇది మా వల్ల సాధ్యమయ్యే పని కాదని చేతులెత్తేశారు. అయితే పొత్తులో ఒకటైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అధినేతలలో ఒకరైన జనసేన పవన్ నిన్న జరిగిన అనకాపల్లి వారాహి యాత్రలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు మీద ఒక హామీ ఇచ్చారు.
నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే, నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగుల బాధలు, ఆవేదనలు తెలుసు, వారి కష్టాలను అర్ధం చేసుకోగలను అంటూనే ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తరువాత వచ్చే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS ) వారి జీవితానికి ఒక భద్రతా, భరోసా వంటిది. అటువంటి దాని కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ప్రభుత్వ ఉద్యోగుల cps సమస్యకు ఒక పరిష్కారం చుపిస్తాము అంటూ కూటమి నుంచి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
అయితే జగన్ మాదిరి రెండు వారాలలో సమస్యను పూర్తి చేస్తాం అంటూ అనివి కానీ హామీలు కాకుండా పూర్తి ఆలోచనతో, పూర్తి చేయగలను అనే గట్టి నమ్మకంతో చాలా బాధ్యతగా, జవాబుదారిగా హామీ ఇస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ సీపీస్ రద్దు పై ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. అలాగే యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాన్ని పెంచుతాం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటూ పలు హామీలు గుప్పించారు పవన్.




