పవన్ తో బీజేపీ మంతనాలు…ఇంకెన్ని త్యాగాలు చేయాలో..?

Pawan Kalyan Meeting With Gajendra Singh Shekhawat

టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ ని కూడా కలపడానికి ఎన్నో అవమానాలు – ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, బీజేపీ పెద్దల దగ్గర నానా తిట్లు తిన్నానని చెప్పిన పవన్ ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.

మొన్న బాబు – పవన్ లు ఢిల్లీ వెళ్లి బీజేపీ తో పొత్తు లెక్కలు సరిచేసుకుని వచ్చిన నేపథ్యంలో జనసేన – బీజేపీ కి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది టీడీపీ. అందులో 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లలో జనసేన తమ అభ్యర్థులను బరిలోకి దింపబోతుంది అంటూ పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ తో పొత్తు కన్ఫామ్ చేసుకున్న తరువాత జనసేన పోటీ చేయబోయే 3 ఎంపీ స్థానాల్లో ఒకదానిని బీజేపీ ఆశిస్తుందంటూ వార్తలు ఊపందుకున్నాయి.

ADVERTISEMENT

అయితే బీజేపీ కోరుకున్నట్లే పవన్ ఆ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. జనసేనతో పోలిస్తే ఏ మాత్రం బలం లేని బీజేపీ కి ఆరు ఎంపీ స్థానాలు జనసేనకు 2 ఎంపీ స్థానాల…అంటూ జనసేన క్యాడర్ తో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా నోరెళ్లబెడుతున్నారు.

ఒక సిట్టింగ్ జరిగితేనే జనసేన నుండి ఒక ఎంపీ స్థానాన్ని లాగేసుకున్న బీజేపీ ఇప్పుడు మరోసారి సీట్ల సర్దుబాటు కోసం పవన్ తో భేటీ అంటూ విజయవాడ నోవెటల్ హోటల్ లో చర్చలు మొదలుపెట్టారు. ఇక ఈ చర్చలలో జనసేన నుండి మరో రెండు అసెంబ్లీ సీట్లను కోరుకుంటుందని అందుకోసమే పవన్ తో మరోసారి చర్చలకు సిద్ధమయ్యారని వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనితో పవన్ అసెంబ్లీ సీట్లు 22 కి కుదించి బీజేపీ అసెంబ్లీ సీట్లను 8 కి పెంచుకోవాలని ఆశపడుతున్నారు బీజేపీ పెద్దలు.

మరి అసెంబ్లీ సీట్లను కూడా త్యాగం చేయడానికి పవన్ అంగీకరిస్తారా లేక బీజేపీ అధిష్టానాన్ని నొప్పించక ఒప్పిస్తారా అనేది వేచి చూడాలి. అలాగే పవన్ పోటీ చేయబోయే స్థానం పైన కూడా ఇంతవరకు ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి రాకపోవడంతో దానిపైనా కూడా పార్టీ అభిమానులలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు భీమవరం లేదా పిఠాపురం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తారు అనుకున్న పార్టీ వర్గాలకు ఇప్పుడు కాకినాడ లేదా అనకాపల్లి నుండి ఎంపీ గా పోటీ చేయబోతున్నారనే సమాచారం బయటకు రావడంతో ఇప్పటికైనా ఇటువంటి వార్తల పై ఒక స్పష్టత ఇవ్వాలి అంటూ పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు జనసైనికులు.

‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు’ అనే డైలాగ్ ను నమ్ముకుని ‘ప్రతి సందర్భంలోను పవన్ ఇలా తగ్గుతూ పొతే ఇక నెగ్గే అవకాశమే లేకుండా పోతుంది’ అనేది గ్రహించాలి. 24 సీట్లేనా అనుకుంటున్నా జనసేన పార్టీ క్యాడర్ ఇప్పుడిప్పుడే సర్దుకుని పవన్ నిర్ణయాన్ని బలపరచడానికి సిద్దమవుతున్న ఈ తరుణంలో ఈ 24 లో కూడా కోత అంటే పార్టీ క్యాడర్ నీరుకారే అవకాశం లేకపోలేదు.

ఇలా మిత్ర ధర్మం పేరిట ప్రతిసారి త్యాగాలకు సిద్దపడి పవన్ తన పార్టీ బలాన్ని తానే తగ్గించుకుంటూ పార్టీ కోసం పనిచేసే వారి మానసిక స్తైర్యాన్ని తగ్గిస్తున్నారు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ కోసం పవన్ చేసిన త్యాగానికి తెలంగాణ నేతల నుండి ఏపాటి గౌరవం దక్కిందో పవన్ ఆలోచించాలి. ఇలా బీజేపీ కోసం త్యాగాలు చేసుకుంటూ పొతే ఇక పార్టీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు ఎప్పటికీ నాయకులుగా ఎదుగుతారు..? పవన్ ను జనసైనికులు చూడాలనుకుంటుంది త్యాగరాజుగా కాదు ముఖ్యమంత్రి గా అనేది పవన్ గుర్తించాలి.

ADVERTISEMENT
Latest Stories