జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం హైదరాబాద్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కలిశారు. ఈ విషయం జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ వారిద్దరి సమావేశమవుతున్నారని తెలియజేసింది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలతో కలిసినప్పుడు బిజెపితో కలిసి సాగుతామని చెప్పారు. రాష్ట్ర బిజెపి నేతలు కూడా జనసేనతో కలిసి పనిచేస్తామని చెప్పారే కానీ అటువంటి ప్రయత్నం చేసిన్నట్లు కనబడలేదు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి భేటీ అవడంతో వారిద్దరూ దేని గురించి చర్చిస్తున్నారనేది ఆసక్తికరం.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు బిజెపి పెద్దలతో ఏమి చర్చించారో, వారు ఏమి సూచించారో ఎలాగూ చెపుతారు. అయితే ఢిల్లీలో బిజెపితో కలిసి పనిచేస్తామని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి భేటీ అవడం గమనార్హం. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా టిడిపితో పొత్తులకే ఆసక్తి చూపుతున్నారని భావించవచ్చు. అయితే బిజెపిని కాదని టిడిపితో పొత్తులకి సిద్దపడితే పర్యవసనాల గురించి ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్కి సూచించే ఉంటారు కనుక అదీ ఇరువురూ చర్చించే ఉంటారు.
ఇప్పటికే టిడిపి చాలా నియోజకవర్గాలలో అభ్యర్ధులను ప్రకటించేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరిన్ని సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేయడం ఖాయమే. కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తులు పెట్టుకొనే ఆలోచనలో ఉంటే ముందుగా సీట్ల సర్దుబాట్ల గురించే చర్చించాల్సి ఉంటుంది. కనుక ఈరోజు సమావేశంలో ఈ విషయంపై కూడా ఇద్దరు నేతలు లోతుగా చర్చించే ఉంటారు. వారి భేటీ గురించి జనసేన ఏమైనా వివరాలు తెలియజేస్తే పూర్తి స్పష్టత వస్తుంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నప్పుడు బిజెపితో కలిసి పనిచేస్తానని చెప్పారు. అందుకు బిజెపి కంటే వైసీపీయే ఎక్కువ సంతోషించి ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి భేటీ అవ్వడంతో మళ్ళీ వైసీపీలో టెన్షన్ మొదలవుతుంది. దానికి తొలి సంకేతంగా అప్పుడే మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో సెటైర్ కూడా వేశారు.



