2019 ఎన్నికలలో వైసీపీ కి ఏపీ ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అవకాశం ను జగన్ ఎంత చక్కగా వినియోగించుకున్నారో ఇప్పుడు ప్రతిపక్ష నేతలు వేస్తున్న నామినేషన్ అఫడవిట్ లో సాక్షత్కారమవుతున్నాయి. 2019 ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క జగన్ మీద మాత్రమే సుమారు 32 కేసులు నమోదయ్యాయి.
ఈ సంఖ్యను ప్రతిపక్ష నేతలు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు అనే ఉద్దేశంతోనే, లేక తన ప్రత్యర్థి కూడా తన స్థాయి వారై ఉండాలనే అభిప్రాయంతోనే జగన్ తన ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను కూడా తన కున్న అధికారం అనే ఆయుధంతో ఇంచుమించు తన స్థాయికి తెచ్చే ప్రయత్నం చేసారు.
ఈ రోజు పిఠాపురంలో ఎన్నికల నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అఫడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటుగా కొత్త గా తన పైన నమోదైన కేసుల వివరాలను కూడా వెల్లడించారు. 2019 లో పవన్ అందించిన ఎన్నికల అఫడవిట్ లో ఏపీలో పవన్ మీద ఒక్క కేసులేదు. కానీ గడిచిన ఈ ఐదేళ్లల్లో పవన్ పై వైసీపీ ప్రభుత్వం ఆరు కేసులు నమోదుచేసింది.
పవన్ అందించిన అఫడవిట్ లో తనపైన మొత్తం 8 కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. ఇందులో 2018 లో మీడియా మీద చేసిన వివాదాస్పద వ్యాక్యల పైన ఒక కేసు, 2021 లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాక్యలకు గాను తెలంగాణలో 2 కేసులు నమోదు అవ్వగా ఆ మిగిలిన 6 ఏపీ ప్రభుత్వం నమోదుసింది.
ఇందులో 2022 న ఇప్పడం గ్రామ సమస్య పై పోరాడడానికి కారుపైన ప్రయాణించినందుకు ఒకటి, 2023 జులై లో విజయవాడ, ఏలూరులో 2 కేసులు, అలాగే 2023 లో వాలంటీర్ల మీద చేసిన విమర్శలకు గాను మరో 3 కేసులు పవన్ నెత్తిన వేసింది వైసీపీ ప్రభుత్వం. దీనితో జగన్ ప్రభుత్వంలో ‘పవన్ తీసుకున్న ప్యాకేజ్ ఈ ఆరు కేసులే’ అనిచెప్పవచ్చు.
ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు టీడీపీ, జనసేన ముఖ్య నేతల పై వైసీపీ ప్రభుత్వంలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దానిలో టీడీపీ అధినేత చంద్రబాబు పై 2019 కి ముందు 2 కేసులు ఉండగా వైసీపీ ప్రభుత్వం ఏకంగా 22 కేసులు నమోదు చేసింది. ఇప్పుడు బాబు పై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు లోకేష్ కూడా వైసీపీ బాధితుడే అనేది ఆయన అఫిడవిట్లో కేసుల లిస్ట్ చూస్తే అర్ధమవుతుంది.
అలాగే నారా లోకేష్ కూడా జగన్ ప్రభుత్వంలో 24 కేసులు వెనకేసున్నారు. ఇలా ఒక్క బాబు, పవన్, లోకేష్ లు మాత్రమే కాదు టీడీపీ, జనసేన లో ఉన్న ముఖ్యనేతలు అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర, పట్టాభి, పరిటాల శ్రీరామ్, RRR , జేసీ బ్రదర్స్, అనిత, కిరణ్ రాయల్, బొలిశెట్టి సత్యనారాయణ, శివ శంకర్ ఇలా రెండు పార్టీల ముఖ్య నేతల మీద వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదుచేసింది.
ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చింది, ఎన్ని పెట్టుబడులు రాబట్టగలిగింది, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగింది, ఎన్ని హామీలు నెరవేర్చింది, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగావకాశాలను సృష్టించగలిగింది, ఎంతమందికి ఉపాధి కల్పించగలిగింది, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఎంత అంటే చెప్పలేదు కానీ ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసుల లిస్ట్ ఎంత అంటే మాత్రం ఇట్టే చెప్పగలుగుతున్నారు.
అంటే ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనతలివేనా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడం మీద పెట్టిన ద్రుష్టి రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టినట్లయితే ఈ ఐదేళ్ల అవకాశం మరో ఐదేళ్లకు కొనసాగి ఉండేది అంటూ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది.




