టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురూ చాలా కాలంగా ఓ విషయం పదేపదే చెపుతున్నారు. ఏపీ సిఎం జగన్ కుడి చేత్తో జనాలకి డబ్బు ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకొంటున్నాడని చెపుతున్నారు.
బస్సు ఛార్జీలు, కరెంట్ చార్జీల పెంపు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ట్రాఫిక్ చలాన్లు, నకిలీ మద్యం అమ్మకాలు ఇలా రకరకాల పేర్లతో ఆ డబ్బుని వెనక్కు తీసుకొంటున్నాడని వారు వాదిస్తున్నారు. వీటన్నిటి గురించి ప్రజలకు అనుభవపూర్వకంగా తెలుసు.
కానీ రాష్ట్రంలో ఇంకా వీటి గురించి తెలియని వారు ఎవరైనా ఉండిపోతే మాజీ మంత్రి, భీమిలి వైసీపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అర్దమయ్యేలా చెప్పింది వింటే వారికీ అర్దమవుతుంది.
ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం విశాఖ నగరంలో మధురవాడ సమీపంలో మారికవలస వద్ద కొన్ని అభివృద్ధి పనులకు ‘శంకుస్థాపన’ చేశారు.
నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతుంటే, వైసీపి ప్రభుత్వానికి 5 ఏళ్ళ లక్కీ ఛాన్స్ ముగియబోతుంటే, ఇప్పుడెందుకు శంకుస్థాపనలు?అనే అసందర్భ ప్రశ్నని పక్కన పెడితే, ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రామంలోని మహిళలు విద్యుత్ వాడకం తక్కువగా ఉన్న కరెంట్ బిల్లులు ఎందుకు ఇంత ఎక్కువగా వస్తున్నాయని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుని గట్టిగా నిలదీశారు.
దాంతో ఆయన మొదట తడబడినా, పక్కనే ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో గుసగుసలాడిన తర్వాత “మీ అందరికీ జగనన్న చేయూత డబ్బులు నాలుగేళ్లుగా పడుతూనే ఉన్నాయి కదమ్మా?”అని ఎదురు ప్రశ్నించడంతో ఆ మహిళలు షాక్ అయ్యారు.
చేయూత పధకానికి ఈ అడ్డుగోలు కరెంట్ బిల్లుల బాదుడికి సంబంధం ఏమిటి? అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ చెప్తున్న మాటలు ఓసారి గుర్తు చేసుకొంటే సరిపోతుంది.
సరే!ఏదో ఓ పధకం పేరుతో రాష్ట్రంలో లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వం డబ్బు ముట్టజెప్పి మళ్ళీ దానిలో కొంత ఈరూపంలో వెనక్కు తీసుకుంటోంది అని సరిపెట్టుకున్నా, ఏ పధకానికి అర్హులు కానీ మిగిలిన ప్రజల నుంచి కూడా ముక్కు పిండి వసూలు చేస్తోంది కదా?వారెవరికి మొర పెట్టుకోవాలి?
జగన్ తాను ప్రజలకు చాలా మేలు చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటారు. ఇదేనా ఆ మేలు?ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక అంతవరకు జగన్ చేసే ఈ మేలుని భరించక తప్పదుగా!




