తెలంగాణలో ఎన్నికల పోరు ముగియడంతో ఇక ఆంధ్రా పై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్. అందులో భాగంగా పవన్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ పొత్తు ఆవశ్యకతను పార్టీ నేతలకు వివరించారు.
2024 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదని, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ను ఒకటిగా చేయడానికే టీడీపీ పార్టీ తో పొత్తు పెట్టుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు.దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబుని నేను ఎప్పుడు గౌరవిస్తానని, అలాగే తన పార్టీ నేతలు కూడా టీడీపీ పార్టీ పట్ల అంతే గౌరవంతో ఉండాలని కోరుకుంటున్నా అంటూ చెప్పారు.
ఎవరో కొంతమంది నాయకులు పొత్తుని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అవి తన దగ్గరకు వచ్చాయని, అటువంటి చర్యలకు ఎవరు పాల్పడిన దానిని పార్టీ వ్యతిరేక చర్యగానే భావిస్తాను అంటూ హెచ్చరించారు.పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని “వైసీపీ కోవర్టులుగా” పరిగణించాల్సి వస్తుందని పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు.ఒక దశబ్ద కాలం పాటు జనసేన – టీడీపీ పార్టీలకు అండగా నిలబడితే జగన్ ఇక రాజకీయాల వైపు రాకుండా చేయొచ్చని తెలిపారు.
పవన్ తాను తీసుకున్న జనసేన – టీడీపీ పార్టీల పొత్తు నిర్ణయాన్ని జనసేన నేతలు, క్యాడర్ అంగీకరించేలా తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ వస్తున్నారు. పొత్తులో కీలకమైనది ఇరు పార్టీల మధ్య “ఓటుబదిలీ” జరగడమే. ఓటు మార్పిడి జరిగితే అధికార మార్పిడి జరిగినట్టే అనేది అర్ధమయ్యే విధంగా గ్రౌండ్ స్థాయిలో రెండు పార్టీల క్యాడర్ కలిసి పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రాంతాల వారీగా ఎక్కడైనా సమస్యలు ఎదురైనా కూర్చొని సామరస్యంగా పరిష్కారించు కోవాలే కానీ కొట్లాటకు వెళ్లొద్దు అంటూ హితవు పలికారు.
“వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను”…అనే స్టేట్మెంట్ ను నిజం చేయాలి అంటే రెండు పార్టీల మధ్య పార్టీల జెండాలు చూడకుండా అధినేతల ఏజండా చూసి మాత్రమే ఓటు వేసేలా కార్యకర్తలను, సామాన్య ప్రజానీకాన్ని సిద్ధం చేయవలసిన బాధ్యత ఆయా ప్రాంత నాయకులదే అంటూ వారి బాధ్యతను గుర్తు చేశారు. గతంలో కూడా ఈ రెండు పార్టీల మధ్య పెరిగిన దూరంతో జగన్ ప్రజలకు దగ్గరయ్యారు అనే సత్యాన్ని ఇరు పార్టీల అధినేతలు అంగీకరించారు.
ఇక పార్టీ జెండాలను తమ భుజాల మీద మోస్తూ గ్రామ స్థాయిలో పార్టీని నిలబెట్టిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి అడుగులు కలిపితే రాష్ట్రంలో ఫ్యాన్ రెక్కలు విరచడం పవన్ కు చంద్రబాబుకి పెద్ద కష్టసాధ్యమైన పని కాదనే చెప్పాలి.అలాగే టీడీపీ పార్టీ శ్రేణులు కూడా జనసేన పార్టీని, పార్టీ క్యాడర్ ను తక్కువగా చూడడం, అవమానించడం చేయకూడదు.
గౌరవం అనేది ఇద్దరు ఇచ్చి పుచ్చుకుంటేనే పొత్తు ముందుకెళ్తుంది. ఇందులో ఏఒక్కరు హద్దు దాటినా అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రత్యర్థులు పక్కనే కాచుకుని ఉంటారు అనేది గుర్తించి రెండు పార్టీల శ్రేణులు తమ అధినేతల ఆశయాలను నెరవేర్చడానికి ఉమ్మడి లక్ష్యంతో ఒక్కటిగా పని చేయాలి.




