జనసైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేసింది జనసేన. మేమంతా సిద్ధం అంటూ జగన్, ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల ప్రచార హోరు మొదలుపెట్టారు. మేమంతా సిద్ధం సభలతో చేసిన అప్పుల గురించి కాకుండా నొక్కిన బటన్ల గురించి చెప్పుకుంటూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తూ జగన్ ముందుకెళ్తుంటే…,
ఈ ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను, ఆగిపోయిన ప్రాజెక్టులు, అటకెక్కిన రాజధాని, సంక్షేమం పేరుతో జగన్ చేసిన సంక్షోభాన్ని, అప్పులలో తప్ప ఆదాయంలో కనపడని అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతూ బాబు ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టారు. అయితే నా తిక్కకు ఒక లెక్క ఉంది అంటూ చెప్పుకునే పవన్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను అంటూ రేపు తానూ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుండి ఎన్నికల ప్రచారానికి సమర శంఖం పూరించనున్నారు.
రేపటి నుంచి పవన్ తిక్కను, ఆ తిక్క తాలూకా లెక్కను చూడడానికి ఇటు కూటమి మద్దతుదారులు…అటు వైసీపీ సానుభూతిపరులు ఇద్దరు ఒకరు ఆసక్తిగా, మరొకరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటి దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 నియోజక వర్గాలలో పవన్ భారీ బహిరంగ సభలు నిర్వహించి వైసీపీ సిద్ధానికి పవన్ యుద్ధం తో సమాధానం చెప్పడానికి రెడీ అయ్యారు.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో, ఏప్రిల్ 3 తెనాలి,4 నెలిమర్ల, 5 అనకాపల్లి, 6 యలమంచిలి, 7 పెందుర్తి, 8 కాకినాడ, 9 పిఠాపురం, 10 రాజోలు, 11 పి.గన్నవరం, 12 న రాజానగరం ప్రాంతాలలో జనసేన నిర్వహించే బహిరంగ సభలలో పవన్ ప్రసంగిస్తారు అంటూ జనసేన పవన్ ఎన్నిక ప్రచార షెడ్యూల్ విడుదల చేసింది.
వారాహి యాత్ర తో పార్టీకి మునుపెన్నడూ లేని క్రెజ్ ను, నమ్మకాన్ని సాధించుకున్న పవన్ ఇప్పుడు మరోసారి అదే ఊపుని కొనసాగించనున్నారా..? లేదా అనేది రేపటి సభతో తేలిపోతుంది. పొత్తులలో భాగంగా జనసేన కు వచ్చిన సీట్ల సంఖ్యతో నిరుత్సహంలో ఉన్న జనసైనికులను ఉత్సహపరచడానికి.., వై నాట్ 175 అంటూ ఉత్సహంలో ఉన్న వైకాపా నాయకులకు ఓటమి భయం రుచి చూపించడానికి పవన్ తన ప్రచారాన్ని మొదలుపెట్టాల్సి ఉంటుంది.
‘సంక్షేమమే తన పార్టీకి శ్రీరామ రక్షా’ అనే నమ్మకంతో ముందుకెళ్తున్న జగన్ కు ఆ సంక్షేమంతో రాష్ట్రం ఎం కోల్పోయింది…? యువత దేనికి దూరమయ్యారు..? అభివృద్ధి లేని సంక్షేమం రాష్ట్ర భవిష్యత్తుని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది..? అనే వాటిని వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి, కల్పించబోయే ఉద్యోగాలను తెలియచేయాలి.
అలాగే మంచి నీళ్లు తాగినంతా సులువుగా జగన్ తన మాటలతో ప్రజలను ఎలా మభ్య పెడుతున్నారో…హత్య చేసిన వారిని, హత్య నేరారోపణలు ఎదుర్కుంటున్న వారిని పక్కన పెట్టుకుని…నారాసుర రక్త చరిత్ర అంటూ చేస్తున్న ఆరోపణలు…దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వేస్తున్న నిందలు… సొంత చెల్లెళ్ళ పై చేస్తున్న దూషణలు…ఇలా ఎన్నో అంశాలతో పవన్ అటు వైసీపీ ని ఇటు జగన్ ను ఇరుకునపెట్టే అవకాశం ఉంది. తన ప్రసంగాలతో యువత ను ఎక్కువగా ఆకర్షించ గలిగే పవన్…వారిని ఆలోచింపచేయగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టే.




