రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులకు అంతే లేకుండా పోతుంది.అలాగే వైసీపీ ప్రభుత్వం బెదిరంపులకు లెక్కే లేకుండా పోతుందనే చెప్పాలి.తాజాగా విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు 50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
అయితే తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్నిముగించుకుని విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు పవన్. అగ్ని ప్రమాదంలో బోటులు నష్టపోయిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారు తిరిగి నిలదొక్కుకోవడానికి తనవంతు సాయం చేయడానికి సిద్ధమయ్యారు పవన్. ఎవరు ఎంతమొత్తంలో చేయూతనిచ్చిన అందుకోవడానికి సిద్ధంగా ఉన్న మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారని జనసేన పార్టీ నేతలు తెలిపారు.
పవన్ అందించే ఆర్థిక సాయం అందుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం ఆగిపోతుందని, ఎవరైతే పవన్ వెంట నిలబడుతారో వారికి కూడా ఈ ప్రభుత్వ సాయం దొరకదని మా ప్రభుత్వ సాయం కావాలా ? పవన్ సాయం కావాలా ?తేల్చికోండి అంటూ వైసీపీ స్థానిక నాయకులు మత్స్యకార కుటుంబ బాధితులకు అల్టిమేటం జారీ చేసారంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
151 సీట్లతో అధికారాన్ని అందించిన ప్రజలను బెదిరించడం భయపెట్టడం ఒక్క వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని, ఇక ఈ పార్టీకి కూడా చెల్లు చీటీ ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ జనసేన నేతలు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ బెదిరింపులు ఇలా ఉంటే ప్రభుత్వం పై పవన్ విమర్శలు మరోలా ఉన్నాయి.వైసీపీ రూపాయి పావలా ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు.
80 % శాతం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి 25 లక్షల నష్టం జరిగితే 15 లక్షలు చెల్లిస్తామని చెప్పి చివరికి 5 నుంచి 7 లక్షలు మాత్రమే బాధితులకు అందించారని.., మిగిలిన ఆ మొత్తం సొమ్ము ఎవరి వ్యక్తిగత ఖాతాలోకి వెళ్లిందో చెప్పాలని బాధిత కుటుంబాలు వైసీపీ నేతలను ప్రశ్నించాలని కోరారు.440 కోట్లతో జగన్ తన విలాసాల కోసం పర్యావరణాన్ని సైతం లెక్కచేయకుండా రుషికొండ మీద ప్యాలస్ నిర్మించుకుంటున్నారని ఆ మొత్తం హార్బర్ అభివృద్ధికి ఖర్చు చేస్తే వేల మంది కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలియచేసారు.
అసలు ఎప్పుడు నేను విశాఖ రావాలన్న ఈ ప్రభుత్వం మా పై ఎందుకు ఇంతలా ఆంక్షలు పెడుతుందో? ఎందుకు జనసేనను చూసి జగన్ ప్రభుత్వం భయపడుతుందో? సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు.అలాగే జీవో 217 ను కూడా జనసేన వ్యతిరేకించిందన్నారు. ఇంకొక్క నాలుగు నెలలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని భరించాల్సిందే., ఆ తరువాత రానున్న జనసేన – టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకార సోదరులకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జనసేన పార్టీ ఎంతోకొంత ఆర్థిక సాయం ప్రకటించకపోతే వైసీపీ ప్రభుత్వంలో అసలు చలనం వచ్చేది కాదని, దండుపాళ్యం బ్యాచ్ లా తయారయ్యి రాష్ట్రాన్ని మొత్తం దోచేస్తున్నారని జగన్ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసారు పవన్. వైసీపీ నాయకులు బెదిరింపులు చివరికి బాధితుల వరకు చేరాయి అంటే వారి రౌడీ పాలనా ఏవిధంగా ఉందో ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలన్నారు. ఇలా పవన్ VS జగన్ మాదిరి రాజకీయ విమర్శల వేడి విశాఖలో మళ్ళీ మొదలయ్యాయి. ఇక ఇప్పుడు పవన్ విమర్శలకు కౌంటర్ వేయడానికి వైసీపీ గ్యాంగ్ మీడియా ముందుకు రావడమే ఆలస్యం.




