గత కొద్దీ రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పదవి మీద టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అటు ముఖ్యమంత్రి దృష్టికి ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.
అయితే ఈ నేపథ్యంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ ఈ విషయమై టీడీపీ పార్టీ శ్రేణులు ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసారు. అలాగే ఇటు జనసేన పార్టీ తరపున కూడా ఆ పార్టీ క్యాడర్ కు కూటమి బంధాన్ని విచ్ఛిన్నం చేసేలా ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ బలమైన సంకేతాలు అందించారు.
అయినా కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అనే వివాదం చుట్టే ఈ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతూనే వస్తుంది. ఇక ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకడానికి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నే నేరుగా రంగంలోకి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. తన అభిమానులకు, తన పార్టీ మద్దతుదారులకు ఒక బహిరంగ లేఖ రూపంలో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్.
ప్రియమైన జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు ఇది నా విన్నపం అంటూ మొదలుపెట్టిన పవన్ అనవసర వివాదాలలోకి, విభేదాల జోలికి వెళ్లకండి, తానూ ఎన్నడూ ఏ పదవుల కోసం కూడా రాజకీయాలు చేయలేదని, అలాగే ఇక ముందు కూడా అటువంటి రాజకీయాల జోలికి పోబోనని, ఆ విషయాన్ని అందరు గుర్తించి కూటమి బంధాన్ని గౌరవించాలంటూ సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు పవన్.
అయితే జనసేన పార్టీ మద్దతుదారులతో ఎక్కువమంది పవన్ సినీ ఛరిష్మాతో వచ్చినవారే కావడంతో వారి రాజకీయ అపరిపక్వత జనసేనకు, ముఖ్యంగా పవన్ కు అనుకోని చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. సినిమాలో మాదిరి వాస్తవ రూపంలో రాజకీయాలు నడవవు, నడపలేరు కూడా. ఇక్కడ టీడీపీ బలానికి జనసేన మద్దతు ఎంత అవసరమో అలాగే జనసేన నిలబడానికి కూడా టీడీపీ బలం అంతే అవసరం.
ఈ విషయం పై పవన్ కు పూర్తి అవగాహన ఉంది కాబట్టే పవన్ పదే పదే తన పార్టీ క్యాడర్ కు టీడీపీ తాలూకా బలం పై సంకేతాలు ఇస్తుంటారు. అయినా కూడా జనసేన పార్టీలోని కొంతమంది రాజకీయాల పై పూర్తి అవగాహనా లేకుండా, పక్క పార్టీల అంతర్గత విషయాల పట్ల కూడా తమ పార్టీ ఆమోద ముద్ర ఉండాలని ఆశ పడుతుంటారు.
కూటమి బంధం రాష్ట్రానికి బలం, ఆ బలాన్ని పదవులు అనే బలహీనత కోసం విచ్ఛిన్నం చేయడం రెండు పార్టీల శ్రేణులకు తగునా.? ఇప్పటికైనా పార్టీ అధినేతలు ఇస్తున్న ఆదేశాలు పాటిస్తూ ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ అనవసర రాద్ధాంతానికి ముగింపు పలుకుతారా.?






