దశబ్ద కాలం నుండి ఎటువంటి రాజకీయ బలం లేకుండా, చట్ట సభలలో పదవులకు ఆశపడకుండా, ఓటమి తలుపు తట్టినా అధైర్య పడకుండా ప్రజాసమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, వైసీపీని గద్దె దించడానికి పిఠాపురం ను కేంద్రంగా చేసుకుని ఎన్నికల బరిలో నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
అలాగే తన సొంత బలంతో 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కూడా లక్ష ఓట్లను సాధించుకున్న బలమైన నేత వర్మ. అయితే ఈయన 2019 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి జనసేన ఓట్ల చీలిక వల్ల స్వల్ప తేడాతో ఓటమి చవి చూసారు. అయితే ఈసారి కూటమి అభ్యర్థిగా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలి అని గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న వర్మ పవన్, బాబుల నిర్ణయంతో త్యాగానికి సిద్డపడ్డారు.
అయితే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలను కూటమిగా ఏర్పాటు చేయడానికి పవన్ పడ్డ కష్టానికి తనకు బలమున్న పిఠాపురంలో కూటమి కోసం వర్మ చేసిన త్యాగానికి పిఠాపురం ప్రజలు తమను ఆశీర్వదించారు అంటూ మీడియా ముందుకు వచ్చారు టీడీపీ నేత వర్మ. టీడీపీ జనసేన పార్టీల మధ్య పూర్తిగా ఓటు బదిలీ జరిగిందని, కనీసం వైసీపీ తరుపున పోలింగ్ బూత్ లో బూత్ ఏజంట్లు కూడా లేరని దాదాపుగా వంగా గీత ఓటమి ఖరారయ్యేనదంటూ బలమైన నమ్మకంతో ఉన్నారు వర్మ.
ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం వైసీపీ సభలో వంగా గీత వేసిన హైడ్రామా ఫలించలేదని, ఆమెను పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్లు నిలదీస్తున్నారని, పోలీసుల భద్రతా వలయంలో వంగా గీత పిఠాపురం పోలింగ్ కేంద్రాలను సందర్శించాల్సిన పరిస్థితికి వచ్చిందంటూ వర్మ పవన్ గెలుపు అనధికారికంగా ప్రకటించారు. ఇర్వడాలో వంగా గీతను రానివ్వలేదు అంటూ చెప్పిన వర్మ 90 శాతం ఓటింగ్ పవన్ కే అంటూ తేల్చేసారు.
బాబుకి ఇచ్చిన మాట కు కట్టుబడి, పవన్ తన పై పెట్టిన బాధ్యతకు తలవంచి జనసేన గెలుపు కోసం ఎన్నికల ప్రచారం మొదలుకుని పోలింగ్ వరకు టీడీపీ, జనసేన నేతలను, కార్యకర్తలను కలుపుకుని ముందుకెళ్లారు వర్మ. దానిలో భాగంగానే ఈ పోలింగ్ రోజు కూడా పిఠాపురంలో అన్ని ప్రాంతాలలో పోలింగ్ సరళి ఏవిధంగా జరుగుతుందో పరిశీలిస్తూ తన పై పవన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు వర్మ.






