జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పిఠాపురంలో గెలుపొందాలన్న కోరికతో ఉన్న వైసీపీ, తమ చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. మళ్ళీ తనకు జన్మంటూ ఉంటే పిఠాపురంలోనే పుడతాను, తన అంతిమ యాత్ర ఇక్కడే కొనసాగుతుందని, తనను ఆశీర్వదించమని కన్నీటి పర్యంతం అవుతూ వంగా గీత సభను కాస్త రక్తి కట్టించే ప్రయత్నం చేసారు.
ఓ వైపు వంగా గీత తనదైన శైలిలో ఇలా సెంటిమెంట్ ను పండించాలని పూర్తిగా ప్రయత్నిస్తుండగా, ఇదే వేదికపై నిల్చున్న వైసీపీ అధినేత జగన్, అదే సమయంలో వంగా గీత వైపు చూస్తూ నవ్వులు పూయిస్తుండడం విశేషం. నిజానికి జగన్ కు ఇదేమి కొత్త కాదన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే.
గతంలో ప్రకృతి ప్రకోపించి ఏపీలో తుఫాన్ భీభత్సం సృష్టించిన సమయంలో ఆపదలో ఉన్న ప్రజలకు దగ్గరికి వెళ్లి “షిక్కటి షిరునవ్వులు” చిందించిన విషయం తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కాలం చేసి సినీ లోకంతో పాటు మహేష్ బాబు పుట్టెడు దుఃఖంలో ఉన్నపుడు పలకరించడానికి వెళ్లిన జగన్, అదే తరహాలో “షిక్కటి షిరునవ్వుల” సంగతి ప్రజలోకానికి ఇప్పటికి కళ్ళముందు కనపడుతూనే ఉంది.
నిజానికి ఈ రెండు సందర్భాలలో మాత్రమే కాదు. గడిచిన అయిదేళ్లలో ఇలాంటి సందర్భాలు కోకొల్లలు. ఆర్ఆర్ఆర్ ను పోలీసుల చేత కొట్టిస్తూ వీడియో చూసిన విధానమైనా… ఓ పక్కన మెగాస్టార్ చిరంజీవి వినమ్రంగా తమ విజ్ఞప్తులు వినిపిస్తుంటే, జగన్ చిరునవ్వులు ప్రదర్శిస్తూ తనదైన ఇజాన్ని గుర్తు చేసిన వైనం బహుశా ఏ సినీ అభిమాని మరిచిపోకుండా ఉండలేడు.
ఇలాంటి వీడియోలే నేటికీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ట్రోలర్స్ కు సముచిత ఆహారాన్ని అందిస్తున్నారు. ఇదే వైనాన్ని గతంలో రఘురామకృష్ణంరాజు వివరిస్తూ లండన్ లో జగన్ మందులు వాడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. అలాగే ‘సైకో పోవాలి’ అంటూ చంద్రబాబు నాయుడు కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు.
ఇక పిఠాపురం విషయానికి వస్తే, వంగా గీత తర్వాత మైక్ పట్టుకున్న జగన్ యధావిధిగా చెప్పే పవన్ నాలుగు పెళ్లిళ్లు అంటూ మొదలుపెట్టి, తాను బటన్ నొక్కినా డబ్బులు రాకపోవడానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేనని చెప్పుకొచ్చారు.
కానీ అసలు నిజం ఏమిటంటే… మూడు నెలల పాటు లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు వెళ్లకుండా చేసిన జగన్, ఎన్నికల కోడ్ రీత్యా ఈసీ తీసుకున్న చర్యలను తమ మీదకి నెట్టివేయడం. పిఠాపురం వేదికగా ప్రజలకు మరో ‘జ్ఞానగుళిక’ను వదిలారు జగన్ మోహన్ రెడ్డి.
2019లో మంగళగిరిలో నారా లోకేష్ పై ఆళ్ళ రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే, మంత్రి పదవితో సత్కరిస్తానని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా, ‘మాట తప్పడం – మడమ తిప్పడం’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పిఠాపురం వేదికగా అలాంటి హామీనే మరోసారి గుప్పించారు.
పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవితో సత్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. గతంలో మంగళగిరి లాంటి హామీనే ఇది కూడా అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… వంగా గీతను డిప్యూటీ సీఎంని చేయాలంటే, వంగా గీత గెలవడమే కాదు, వైసీపీకి అధికారం కూడా రావాలి కదా!






