ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనలు, వైఖరి, పాలన, నిర్ణయాల విషయంలో దేశ ప్రజలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి… ఎటువంటి సందేహమూ లేదు. అయితే మోడీ ప్రభుత్వం దేశంలో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేసిందనే విషయంలో బహుశః ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చు.
ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దేశంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతుండేవి. కశ్మీర్లో ఎప్పుడూ హింసాత్మక సంఘటనలు జరుగుతుండేవి. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు బహిరంగంగా తుపాకులు పట్టుకొని తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండేవారు.
కానీ ఇప్పుడు దేశంలో ఉగ్రదాడులు దాదాపు నిలిచిపోయాయి. కశ్మీర్లో వేర్పాటువాదుల గొంతు వినిపించడం లేదిప్పుడు. భారత్లో పాకిస్తాన్ వేలు పెట్టడం కూడా తగ్గింది.
ఒకప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ తలవంచుకొని నిలబడాల్సిన పరిస్థితులు నెలకొని ఉండేవి. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ ప్రతిష్ట ఇనుమడించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ మాటకు విలువ పెరిగింది.
కరోనా, లాక్డౌన్, రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా, ఇజ్రాయెల్-ఇరాన్ మద్య జరుగుతున్న యుద్ధాల వలన చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడగలిగింది. అయితే డాలర్తో భారత్ రూపాయి విలువ పడిపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమే.
పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పోర్టుల నిర్మాణం, ఉన్నత విద్యకు మోడీ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇచ్చింది. భారత్లో నిరుద్యోగ సమస్యను తగ్గిస్తూనే దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మేకిన్ ఇన్ ఇండియా’ వంటి చక్కటి కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తోంది.
దానిని అందుకొన్న మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు పారిశ్రామికంగా చాలా అభివృద్ధి సాధించి లక్షాలది మందికి ఉద్యోగాలు కల్పించుకోగా, జగన్ ప్రభుత్వం మాత్రం దానిపై ఆసక్తి చూపకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. వెనుకబడిపోయింది.
మోడీ ప్రభుత్వంలోని అనేక అవలక్షణాలను, అనాలోచిత నిర్ణయాలు, వాటి తీవ్ర పర్యవసనాలను పక్కన పెట్టి ఇటువంటివి చూసిన్నట్లయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే చాలా మెరుగైన పాలన అందిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
ఈ సానుకూల అంశాలే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఓ మెట్టు పైన ఉండేలా చేస్తున్నాయని చెప్పవచ్చు.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా కానీ, ఇండియా కూటమితో కలిసి గానీ బీజేపీని ఎదుర్కొని నిలబడగలిగే పరిస్థితి లేకపోవడం కూడా మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి చాలా కలిసివచ్చే అంశమే.
కనుక మోడీ తీరుని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారు సైతం కాంగ్రెస్, ఇండియా కూటమికి ఓట్లు వేసేందుకు సందేహించే పరిస్థితి నెలకొంది. కనుక మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమే. ఎంత మెజార్టీతో వస్తుందనేదే ప్రశ్న.






