అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతుల ఆందోళన 12వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే నిరాహాదదీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారమైనా ఉదయాన్నే రైతులు, రైతు కూలీలు, మహిళలు రోడ్డపైకి చేరుకుని దీక్షా శిబిరాల్లో పాల్గొంటున్నారు.
ఇది ఇలా ఉండగా మొన్న ఉద్దండరాయునిపాలెంలో తమను పదే పదే పెయిడ్ ఆర్టిస్టులంటూ సంబోధిస్తున్న కొంత మంది మీడియా వారి మీద దాడి చేసిన కేసులో నలుగురు రైతులను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోగులమూడి సురేందర్, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, ప్రత్తిపాటి సతీశ్, ఆళ్ల శివబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఏ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వారికి మద్దతుగా పోలీస్ స్టేషన్ల ముందు రైతులు ధర్నా చేస్తున్నారు. తెనాలి పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం. దాడిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నప్పటికీ అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వారి జోలికి వెళ్ళలేదు. ఇది ఇలా ఉండగా అమరావతి భవితవ్యాన్ని నిర్ణయించే హై పవర్ కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటికే జీఎన్రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తుంది ఈ కమిటి. ఆ రిపోర్టుని అసెంబ్లీ ముందు పెట్టి, సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికోసం ప్రభుత్వం అవసరమైతే జనవరి మూడవ వారంలో ప్రత్యేకంగా సభని సమావేశపరచాలని అనుకుంటుంది.





