రాజకీయం అనేది ఎప్పటికి ఎవ్వరికి పూలబాట కాదు ముళ్ల బాటే అవుతుంది. అయితే ఓర్పుతో, నేర్పుతో, వ్యూహాలతో ప్రత్యర్థి అంచనాలను మించి ఎప్పటికప్పుడు ముందంజలో ఉన్నవాడే రాజకీయంలో నిలబడతాడు…కలబడతాడు…సాధిస్తాడు..!
ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనే వెండితెర మీద అడుపెడితే ఇక్కడ తమ అదృష్టం పరీక్షించుకోవడానికి ఎన్నో రాజకీయ పార్టీలు అనే చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. అయితే వాటిలో కొన్ని పార్టీలకు అనూహ్య ప్రజాదరణ దక్కితే మరికొన్ని పార్టీలు విడుదలైన కొన్ని రోజులకే మూటాముల్లె సర్దుకుని రాజకీయ కురుక్షేత్రం నుండి కనుమరుగయ్యాయి.
కొన్ని దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అవసరమొచ్చింది అనే ఉద్దేశంతో తెలుగు వాడి ఆత్మ గౌరవం పేరుతో టీడీపీ పార్టీని స్థాపించారు ఎన్టీ. రామారావు. అప్పటి వరకు కాంగ్రెస్ జెండా, హస్తం గుర్తు తప్ప మరొకటి తెలియని ఏపీ ప్రజలకు పసుపు జెండాను, సైకిల్ గుర్తును పరిచయం చేసారు ఎన్టీఆర్.
పార్టీ పెట్టిన 9 నెలలకే పార్టీని అధికారంలోకి తెచ్చి తెలుగు వాడి పౌరుషం ఢిల్లీకి చూపించింది టీడీపీ జెండా. అయితే ఎన్టీఆర్ మరణంతో టీడీపీ పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ సతీమణిగా చెలామణి అయిన లక్ష్మి పార్వతి 1995 లో ఎన్టీఆర్ టీడీపీ అంటూ మరోపార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి సింహం గుర్తు కేటాయించింది ఈసీ.
అయితే రెండు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కున్న ఎన్టీఆర్ టీడీపీ కనీసం ఒక్కసారి కూడా డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. స్వయంగా పార్టీ అధినేత లక్ష్మి పార్వతి పోటీ చేసిన స్థానంలో కూడా ఆమెకు కేవలం 900 ఓట్లు మాత్రమే దక్కాయి. దాంతో ఆమె తన రాజకీయ పార్టీకి ముగింపు పలికి కాంగ్రెస్ గూటికి చేరారు.
ఆ తరువాత చంద్రబాబు తో వచ్చిన విభేదాల కారణంగా 1999 లో అన్న ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ మరో పార్టీని స్థాపించి సార్వత్రిక ఎన్నికలలో ఒక్కరిని కూడా చట్ట సభలకు పంపలేకపోయారు. స్వయంగా పార్టీ అధినేత హరికృష్ణ గుడివాడ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీనితో తన పార్టీని టీడీపీ లో విలీనం చేసి మళ్ళీ బాబు నాయకత్వానికి జై కొట్టారు హరికృష్ణ.
రాజకీయాలలో జవాబుదారీ తనం రావాలి, చదువుకున్న యువతకు రాజకీయాలు ఒక బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఐఏఎస్ గా సేవలందించిన జయప్రకాష్ నారాయణ తన బాధ్యతకు రాజీనామా చేసి 1996 లో లోక్ సత్తా అంటూ ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరించారు. అయితే సమకాలీన రాజకీయ పరిస్థితులను తట్టుకుని రాజకీయాలు చేయడంలో వెనకబడిన జయప్రకాష్ ఆలోచనను ప్రజలు ఆదరించలేదనే చెప్పాలి.
రాజకీయాలలో మార్పు రావాలి అనుకున్న లోక్ సత్తా తన ఉన్నత సిద్దాంతాలను మార్చుకోలేక రాజకీయ వెండితెర మీద సమాదయ్యింది. 2005 లో తెలంగాణ ఆవిష్కరణే ప్రధమ ధ్యేయంగా తెరమీదకు వచ్చింది నటి విజయ శాంతి స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీ. అయితే తన పార్టీ ఆదర్శాలకు దగ్గర పని చేస్తున్న కేసీఆర్ తెరాస పార్టీలో తల్లి తెలంగాణను విలీనం చేసి తెరాస పార్టీలో కీలక పాత్ర పోషించారు విజయశాంతి.
ఇక రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకుని తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి టీడీపీ పార్టీకి బై బై చెప్పి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు దేవేంద్ర గౌడ్. అయితే రాజకీయ రణరంగంలో నిలబడడం అంత సులువు కాదు అని తెలుసుకున్న దేవగౌడ్ తన పార్టీని కూడా తెరాస లో విలీనం చేసి తానూ కేసీఆర్ కారెక్కడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రో.కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతో ప్రజల ముందుకొచ్చి ఓటమిని అందుకున్నారు.
అయితే ఈ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే తెలంగాణ లో ఏర్పడిన మరో రాజకీయ పార్టీ వైస్సార్ టి.పి. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తెలంగాణలో కొనసాగించడానికి వైస్సార్ కుమార్తె వైస్ షర్మిల
2021 లో వైస్సార్ టి.పి పేరుతో తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టింది.
అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి వెనకడుగు వేసిన షర్మిల ఎన్నికల తంతు పూర్తైన తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనంచేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏపీ రాజకీయాలకు షిఫ్ట్ అయ్యారు ఈడ పిల్ల..ఆడ పిల్ల షర్మిల. ఇక ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక మలుపు తిప్పిన పార్టీ ప్రజారాజ్యం.
వెండి తెర మీద కొన్ని దశాబ్దాల పాటు అగ్రస్థానంలో కొనసాగుతూ సినీ రంగాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన మెగా స్టార్ చిరంజీవి రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి రాజకీయాలలో సామజిక న్యాయం కావాలంటూ రైల్ ఇంజన్ గుర్తుతో ప్రజారాజ్యాన్ని 2008 లో ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. 2008 ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో తలబడిన ప్రజారాజ్యం కేవలం 18 స్థానాలకే పరిమితమయ్యింది.
అయితే సినీ రంగంలో ఉన్న క్రేజ్ రాజకీయ రంగంలో రాణించడానికి సరిపోదు అని తెలుసుకున్న చిరు రాజకీయాలకు తానూ సరిపడను అనే సత్యాన్ని గుర్తించి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ సినీ రంగానికి తిరిగి వెళ్లిపోయారు. దీనితో ఏపీ రాజకీయ చరిత్రలో మరో రాజకీయ పార్టీ కనుమరుగవ్వక తప్పలేదు.
ఇలా తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి కొందరు, కుటుంబ సభ్యుల మీద పంతానికి కొందరు, వచ్చిన రాజకీయ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలని మరికొందరు, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని మరికొందరు రాజకీయ కురుక్షేత్రంలో అడుగు పెట్టినప్పటికీ అక్కడ ఉండే ఒత్తిడిని తట్టుకోలేక పార్టీ జెండాను నిలబెట్టుకోలేక ఎన్నికల రణరంగంలో నేలకొరిగారు.






