ఈసారి ఎన్నికలలో అటు వైసీపి, ఇటు టిడిపి, జనసేన, బీజేపీలు చాలా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. వైసీపి నేతల స్టేటెమెంట్స్ వింటే కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందని స్పష్టం అవుతోంది. అయితే కూటమిలో మూడు పార్టీలు ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చూపిన శ్రద్ద గ్రామీణ ఓటర్లకు కూటమి అభ్యర్ధులకు ఏవిదంగా ఓట్లు వేయాలో వివరించడంపై చూపలేదు.
ఉదాహరణకు పొత్తులో భాగంగా ఓ నియోజకవర్గంలో టిడిపికి బదులు బీజేపీ లేదా జనసేనకు బదులు టిడిపి అభ్యర్ధులు పోటీ చేస్తున్నప్పుడు, కూటమిలో మిగిలిన రెండు పార్టీల అభ్యర్ధులు, వారి ఎన్నికల చిహ్నాలు ఈవీఎంలలో ఉండవని, కనుక బీజేపీ లేదా జనసేన లేదా టిడిపికి ఓట్లు వేస్తే కూటమిలో వారు కోరుకున్న పార్టీకే ఓట్లు వేసిన్నట్లే అని ఎవరూ గ్రామీణ ఓటర్లకు వివరించలేదు. పైగా అనేక నియోజకవర్గాలలో ‘గాజు గ్లాసు’ స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించారు.
ఈ విషయంలో వైసీపికి అడ్వాంటేజ్ లభించింది. వైసీపి ఒంటరిగా పోటీ చేసింది కనుక ఈవీఎంలలో ఫ్యాను గుర్తుకి బటన్ నొక్కితే వైసీపికి వేస్తున్నామని ప్రతీ ఓటరుకు తెలుసు.
కానీ టిడిపి లేదా జనసేన (గాజు గ్లాసు)కే ఓట్లు వేయాలనుకున్న గ్రామీణ ఓటర్లకు ఈవీఎంలలో తాము కోరుకున్న పార్టీల అభ్యర్ధులు, వారి ఎన్నికల గుర్తులు కనబడకపోవడంతో కాస్త అయోమయానికి గురయ్యారు. పైగా స్వతంత్ర అభ్యర్ధుల ‘గాజు గ్లాసు’తో అయోమయానికి గురవడం పలు పోలింగ్ కేంద్రాలలో కనిపించింది.
కూటమిలో మూడు పార్టీలు ఆయా నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులని ఓటర్లకు పరిచయం చేశాయి కదా?అని అనుకోవచ్చు. కానీ ఈవీఎంలలో మరో 15 మంది అభ్యర్ధులు, వారి ఎన్నికల చిహ్నాలు కూడా ఉన్నప్పుడు అయోమయానికి గురవడం సహజం.
కనుక కూటమిలో పార్టీలు ఈ విషయంపై గ్రామీణ, పట్టణ ఓటర్లను మరింత ఎడ్యుకేట్ చేసి ఉంటే, కూటమికి పడాల్సిన ఓట్లు అన్నీ కూటమికే పడి ఉండేవి. అప్పుడు మరిన్ని సీట్లు, భారీ మెజారిటీ లభించి ఉండేది.






